తెలుగుదేశం పార్టీ అంటేనే సెక్యులర్ విధానాలకు కట్టుబడే పార్టీ. అన్ని కులాలు, మతాల హక్కుల పరిరక్షణ, సామరస్యం కోసం కృషి చేస్తున్న పార్టీ. పౌరసత్వ సవరణ చట్టం పట్ల దేశ వ్యాప్తంగా అభద్రతా భావం వ్యాపించింది. తెలుగుదేశం పార్టీ నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ (ఎన్పీఆర్), నేషనల్ రిజిష్టర్ ఆప్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)లను వ్యతిరేకిస్తుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముస్లీంలందరికి అండగా ఉండి మద్ధతు తెలుపుతుంది అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. లౌకికవాదానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది. అన్ని వేళలా మైనార్టీ సోదరులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది.
22 మంది వైసీపీ ఎంపీలకు విప్లు జారీ చేసి, పార్లమెంట్లో మద్దతు తెలియజేసి రాష్ట్రంలో ఆగమేఘాలమీద గెజిట్తోపాటు జీవో కూడా జారీ చేసి ఎన్ఆర్సీకి ఇప్పుడు వ్యతిరేకమంటూ జగన్మోహన్రెడ్డి మైనార్టీలను మోసం చేస్తున్నారని ద్వజమెత్తారు.మైనార్టీలు అధికంగా ఉన్న అమరావతిలో రాజధాని నిర్మిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని , వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రంలోని మైనార్టీలు ఉపాధి కోల్పోతున్నారని, ఇసుక కొరత, వివిధ ప్రాజెక్టుల పనులు నిలిపివేయటం, పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోతుండటంతో మైనార్టీ యువత ఉపాధి కోల్పోతున్నారని మైనార్టీ నాయకులు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ...ముస్లీంల సంక్షేమానికి, మెరుగైన జీవనానికి టీడీపీ తోడ్పాటును అందిస్తే మైనార్టీ సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. దేశంలో మొట్టమెదటిసారిగా మైనార్టీల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు, హజ్ హౌస్ల నిర్మాణం, హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం, ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనాలు, రంజాన్ తోఫా, దుల్హన్ పథకం వంటి వాటితో పాటు ముస్లీం విద్యార్ధులకు అనేక రకాలుగా చేయూతను అందించామని చంద్రబాబు నాయుడు తెలిపారు.