నిన్న మొన్నటి వరకూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇసుక సమస్య తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీనిపై ప్రతిపక్షాలు చాలా ఆందోళనలు చేశాయి. కానీ నదుల్లోనిండా నీరు ఉండటంతో ఇసుక తీత సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు ఇసుక లభ్యత ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. అందుకే ఇక ఇప్పుడు ఏకంగా ఇంటికే ఇసుక సరఫరా చేస్తామంటోంది వైసీపీ ప్రభుత్వం

 

ఏపీఎండీసీ ద్వారా ఇసుక డోర్‌ డెలవరీ చేయాలని నిర్ణయించడం జరిగిందని, ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. జనవరి 2వ తేదీన కృష్ణా, 7వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డోర్‌ డెలివరీ చేస్తామన్నారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా 255 రీచ్‌ల నుంచి రోజు వారీగా 80 వేల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 9.63 లక్షల టన్నుల ఇసుక స్టాక్‌ ఉందన్నారు పెద్దిరెడ్డి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక అందుబాటులోకి లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. నూతన ఇసుక పాలసీని కొద్దిగా మార్పులు చేసి ప్రభుత్వమే ఏపీఎండీసీ ద్వారా ఇసుకను డోర్‌ డెలివరీ చేయాలని నిర్ణయం చేయడం జరిగిందని పెద్దిరెడ్డి అన్నారు. దీని వల్ల ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే ఇసుక చేరుతుందన్నారు.

 

 

255 స్టాక్‌ పాయింట్లలో 13 చోట్ల ఆన్‌లైన్‌లో రెండు నిమిషాల్లో రిపీటెడ్‌గా ఒకరే బుక్‌ చేసుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితులు లేకుండా డోర్‌ డెలివరీ చేసేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చామన్నారు. సెప్టెంబర్‌ 5వ తేదీన నూతన ఇసుక పాలసీ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 43.70 లక్షల టన్నులు సరఫరా చేశామన్నారు. ఇంకా స్టాక్‌ యార్డుల్లో 9.63 లక్షల స్టాక్‌ ఉందని చెప్పారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నెలకు 15 లక్షల టన్నుల స్టాక్‌ పెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని, సీఎం ఆదేశాల మేరకు నాలుగు నెలలు తప్పనిసరిగా చేసి 60 లక్షల స్టాక్‌ పెట్టాలని ఏపీఎండీసీ ప్రయత్నిస్తుందన్నారు పెద్దిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: