ఈరోజుతో 2019 సంవత్సరం ముగిసి పోతుంది. కొంతమందికి తీపి జ్ఞాపకాలు కొంతమందికి చేదు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోతుంది. ఇకపోతే ఈ 2019 సంవత్సరం ఎవరికైనా బాగా కలిసి రాలేదు అంటే అది టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే . టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జీవితాంతం గుర్తుండిపోయే సంవత్సరం 2019. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఇయర్ ఘోర పరాజయాన్ని చవి చూశారు చంద్రబాబు. ఏకంగా 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తే వైసీపీ 151 స్థానాలు గెలుచుకోగా తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలతో మాత్రమే సరిపెట్టుకొని ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఇక 25 పార్లమెంట్ స్థానాలకు గాను టిడిపి కేవలం మూడు స్థానాలు మాత్రమే విజయం సాధించింది. అంతేకాదండోయ్ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఏకంగా తన కొడుకు లోకేష్ ను సైతం మంగళగిరి నియోజకవర్గంలో గెలిపించ లేకపోయాడు.
సొంత కొడుకుని కూడా ఎన్నికలలో గెలిపించుకోలేక పోయారనే విమర్శ ను చంద్రబాబు మూటగట్టుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ చవిచూడని అనుభవాలు-జ్ఞాపకాలు 2019 సంవత్సరం లోనే ఎదురయ్యాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నికల్లో గెలవడానికి వైసిపి పార్టీని ఎదుర్కోవడానికి అన్న క్యాంటీన్, యువ నేస్తం, రైతు రుణమాఫీ, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న కిట్, తల్లి బిడ్డ, వంటి పథకాలను చంద్రబాబునాయుడు తీసుకొచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించలేదు. జగన్ ను ఢీ కొట్టేందుకు చంద్రబాబు తెచ్చిన పథకాలు ఏ మాత్రం ఉపయోగపడలేదు.
ఎన్నికలలో ఘోర ఓటమి తోనే చంద్రబాబు షాక్ కి గురయ్యారు అంటే.. ఆ తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడటంతో కూడా చంద్రబాబు మరిన్ని షాక్ లు తగిలాయి. నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీ గూటికి చేరడం... టీడీపీ లోకి కీలక నేతగా ఉన్న గన్నవరం వల్లభనేని వంశీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపికి రాజీనామా చేయడం 2019లో చంద్రబాబు నాయుడుకు ఒక చేదు జ్ఞాపకమే . అంతేకాకుండా ఇల్లు కూల్చేస్తామంటూ ప్రభుత్వం నోటీసులు జారీచేయడం... టీడీపీలో కీలక నేత మాజీ మంత్రి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటి వాటితో చంద్రబాబుకు మొత్తం 2019 సంవత్సరం చేదు జ్ఞాపకాలతో జీవితాంతం గుర్తుండిపోయేలా మారింది. మరి 2020 సంవత్సరం లో చంద్రబాబు అడుగులు ఎటు పడుతాయి. ఎలాంటి షాక్ లు తగులుతాయో చూడాలి మరి.