టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి సెక్షన్ 8 తెలంగాణ విభజన చట్ట ప్రకారం శాంతి భద్రతలను కాపాడాలని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ను కోరారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శాంతి యాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేతలు మంగళవారం సగవర్నర్ తమిళసైని కలిశారు.
135వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తలను గాంధీభవన్కు రాకుండా అడ్డుకోవడం, అరెస్టులు చేయడంపై గవర్నర్కి ఫిర్యాదు చేశారు.గవర్నర్ తమిళసై దృష్టికి టీపీసీపీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఫోన్కాల్కు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సరైన సమాధానం ఇవ్వకుండా అనుచితంగా ప్రవర్తించడం వంటి అంశాలను తీసుకువెళ్లారు.
అనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ..పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. గవర్నర్కి కాంగ్రెస్ నేతల పట్ల పోలీసుల ప్రవర్తనపై ఫిర్యాదు చేశామని ఉత్తమ్ వెల్లడించారు. శాంతి భద్రతలను విభజన చట్టం ప్రకారం కాపాడే ప్రత్యేక అధికారాలు గవర్నర్కి ఉన్నాయని ఆయన తెలిపారు. శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయని.. ‘సేవ్ ఇండియా సేవ్ కానిస్ట్యూషన్’ పేరుతో ర్యాలీకి అనుమతి అడిగామని ఆయన వివరించారు. మేము గాంధీభవన్ లోపలే వేడుకలు నిర్వహించామని పోలీసులు అనుమతి ఇవ్వకపోయిన సరే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా నిషేధిత సంస్థనా? ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారని ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు.
అంతేకాదు ఐపీఎస్ అంజనీకుమార్ ఆంధ్రా కేడర్ అధికారి అని.. ఆయన తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ను అంజనీ కుమార్ ప్రవర్తనపై విచారణ జరపాలని కోరినట్టు ఆయన వెల్లడించారు. ఉత్తమ్కుమార్రెడ్డి విభజన అనంతరం అంజనీకుమార్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారని.. అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని తెలిపారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి పార్టీలు మార్పిస్తున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ వరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి, దారుసల్లామ్లో ఎంఐఎంకి అనుమతి ఎలా ఇచ్చారని ఉత్తమ్ సూటిగా ప్రశ్నించారు. ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు కాంగ్రెస్నేతలు రేవంత్రెడ్డి షబ్బీర్ అలీ, సీతక్క, అంజన్ కుమార్, వీహెచ్ తదితరలు గవర్నర్తో సమావేశమయ్యారు.