ప్రజల్ని గందరగోళానికి గురిచేయడానికే జగన్‌ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేస్తోందని, రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని నిర్ణయించాక, ఆప్రాంతంనుంచి 5 ఏళ్లపాటు పాలనకొనసాగాక, ఇప్పుడు రాజధాని మార్పంటూ, రోజుకోకమిటీ ఎలా వేస్తారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. శివరామకృష్ణన్‌ కమిటీ 13జిల్లాలు తిరిగి అమరావతిని రాజధానిగా ఎంపికచేస్తే, ఇప్పుడు జీ.ఎన్‌.రావు కమిటీ వేయడానికి ప్రభుత్వానికి ఏం అధికారముందన్నారు. జీ.ఎన్‌.రావుకమిటీ నివేదిక రాకుండానే, జగన్‌ దానిగురించి అసెంబ్లీలో మాట్లాడటం,  రాజధాని విశాఖలో రాబోతుందంటూ రాజ్యాంగేతరశక్తిగా విజయసాయి మాట్లాడటం దేనికి సంకేతమని నిమ్మల ప్రశ్నించారు. 

 

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ని ఎప్పుడు నియమించారు.. ఏవిధమైన నివేదిక ఇవ్వాలని నిర్దేశించారో ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. బీసీజీ ఏశాఖ పరిధిలో పనిచేస్తోందని, దానికి ఉన్న నియమనిబంధనలు, పరిధి ఏమిటని, ఏ జీవో ప్రకారం ఆ గ్రూప్‌ని నియమించారో వెల్లడించాలన్నారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా బోస్టన్‌గ్రూప్‌ని నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో, పోర్చుగల్‌లో పనిచేసినప్పుడు బోస్టన్‌గ్రూప్‌పై అనేక వివాదాలున్నాయని, అలాంటి సంస్థను రాజధానిపై నివేదిక ఇవ్వమని ఎవరు ఆదేశించారో, ఎవరిఒత్తిడితో ఈ పనిచేశారో ప్రజలకు చెప్పాలన్నారు. 

 

విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్‌రెడ్డికి బీ.సీ.జీ సంస్థ డైరెక్టర్‌ భట్టాచార్య మంచి మిత్రుడని, విజయసాయి ప్రోద్భలంతోనే రాజధాని అంశాన్ని ఆసంస్థకు అప్పగించారని టీడీపీఎమ్మెల్యే తేల్చిచెప్పారు. అవినీతిరహిత దేశమైన సింగపూర్‌కి చెందిన కన్సార్టియం జోక్యాన్ని ప్రతిపక్షంలో ఉండి తప్పుపట్టిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక ఒకదళారీ  సంస్థైన బీసీజీకి రాజధాని అధ్యయనబాధ్యతలు అప్పగించారని, దానికి కొనసాగింపుగా హైపవర్‌ కమిటీఅనడం దారుణమన్నారు. ఏడునెలల్లో ఉవ్వెత్తున వస్తున్న ప్రజావ్యతిరేకత నుంచి ప్రజలదృష్టిని మళ్లించడానికే రాష్ట్రప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తోం దన్నారు.

 

జగన్మోహన్‌రెడ్డి మైండ్‌గేమ్‌లో భాగంగానే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడన్నారు. ఇసుకకొరతపై, భవననిర్మాణ కార్మికుల మరణాలపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం    ఆందోళన చేస్తున్నవేళ, గన్నవరం ఎమ్మెల్యే వంశీని ప్రలోభపెట్టారని, ఇప్పుడు రాజధాని ఆందోళనలపై టీడీపీచేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి మద్దాలిగిరిని లొంగ దీసుకున్నారని నిమ్మల స్పష్టంచేశారు. నీతి, నిజాయితీలకు కట్టుబడిఉంటానని, ఫిరాయింపులకు తానువ్యతిరేకమని, అలాంటి రాజకీయాలకు పాల్పడనని అసెంబ్లీలో చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు ఆ విషయంలో  కూడా మాటతప్పాడని, స్పీకర్‌ని అడ్డుపెట్టుకొని అసెంబ్లీలో ఫిరాయంపుఎమ్మెల్యేలకు విడిగా సీట్లు ఇప్పిస్తున్నాడని నిమ్మల మండిపడ్డారు. 151 మంది గెలిచారన్న అహంకారం, జగన్‌లో రోజురోజుకీ తగ్గుతోందని, 23మంది సభ్యులున్న టీడీపీకి సమాధానం చెప్పుకోలేకే, జగన్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నాడని నిమ్మల ఎద్దేవాచేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: