ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి సంబంధించిన అవినీతి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈఎస్ఐ స్కామ్ కు పాల్పడి వందలాది కోట్ల రూపాయలను వెనకేసుకుంది. మందుల పేరుతో డబ్బులను దోచుకుంది. ఈ దోపిడీ వ్యవహారంలో ఆమెతో పాటుగా మరికొంతమంది కూడా పాలుపంచుకున్నారు. ఇప్పుడు వీరంతా కటకటాల ఊసలు లెక్కపెడుతున్నారు. ఈ స్కామ్ గురించి లోతుగా విచారణ జరుగుతున్నది.
ఈ విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పది నుంచి పది అవినీతి కేసులు ఆమెపై పెట్టారు. తాజాగా మరిన్ని అవినీతి ఆరోపణలు బయటకు వచ్చాయి. ఇక దేవికా రాణి ప్రోద్బలంతో కొన్ని షెల్ కంపెనీలు పెట్టారు. ఇలా షెల్ కంపెనీలు స్థాపించి దాదాపుగా రూ. 110 కోట్ల రూపాయలకు టోకరా వేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఈ కేసుతో సంబంధం ఉన్న ఓమ్ని చైర్మన్ శ్రీహరిబాబును అదుపులోకి తీసుకున్నారు.
షెల్ కంపెనీలు పెట్టి, వాటి ద్వారా డబ్బులు సంపాదించేందుకు దేవికారాణి, పద్మలు ఆయనకు సహకరించినట్టు తెలుస్తోంది. వారి సహకారంతోనే అయన ఈ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా లెజెండ్ పేరుతో కృపాసాగర్ రెడ్డితో మరో షెల్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీకి అప్పట్లో ప్రభుత్వం రూ. 54 కోట్లు చెల్లించింది. ఇది కూడా దేవికారాణికి సంబంధించిన షెల్ కంపెనీ అని తెలియడంతో అధికారులు షాక్ అయ్యారు.
అంతేకాదు, మరోఅవినీతి బాగోతం కూడా బయటకు వచ్చింది. క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే తెల్లరక్త కణాల కిట్ కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ అవినీతిలో రూ. 11,800 విలువ చేసే ఒక్కో కిట్ ను రూ. 36,800 కి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది భారీ మోసం అని చెప్పాలి. అంటే ఒక్కో కిట్ అసలు ధరకన్నా రూ. 25 వేలు అధికంగా చెల్లించారు. ఇది భారీ గోల్ మాల్ వ్యవహారం అని చెప్పాలి. ఈ స్థాయిలో అవినీతి జరుగుతున్నా చాలా కాలం వరకు బయటకు తెలియకపోవడం విశేషం.