ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా.. ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని తెలిపారు. మంగళవారం  సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.సీఎం వైఎస్‌ జగన్‌తో  సమీక్షలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్సలో  మాట్లాడారు.ఈ సందర్భంగా.. సీఎం వైఎస్‌ జగన్‌ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులతో చర్చించారు. ‘పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం నాకు మాత్రమే కాదు కలెక్టర్లందరికీ నచ్చిన కార్యక్రమం. ఇప్పటివరకూ 22,76,420 మంది లబ్ధిదారులను గుర్తించాం. ఇంకా 15 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకోసం కలెక్టర్లు మరింత ఉధృతంగా పనిచేయాల్సి ఉంటుంది.  మొత్తం భూముల గుర్తింపు ఉన్న రెండు నెలల సమయంలోనే , సేకరణ పూర్తి కావాలి. 


కనీసం రెండు నుంచి మూడు సార్లు ఉన్నతాధికారులు ప్రతి జిల్లాలో   పర్యటించాలి. జిల్లా అధికారులతో చర్చించి.. ఇళ్లపట్టాలు ఇవ్వడంలో ఉన్న సమస్యలను తీర్చడానికి ప్రయత్నించాలి. నిద్రలేచిన దగ్గర నుంచి ఇళ్లపట్టాల అంశంపైనే ఆలోచన చేయాలి. దేవాలయాలు, ఇతర ప్రార్థన స్థలాలు, విద్య, ఆరోగ్య సంస్థలకు సంబంధించిన స్థలాలు కాకుండా ఇతర భూములను ఇళ్ల పట్టాలకు సంబంధించి పరిశీలన చేయాలి అని ఆయన చెప్పారు . ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించి ఇస్తాం’ అని సీఎం వైఎస్‌  జగన్ చెప్పారు.ఈ సందర్భంగా.. సీఎం వైఎస్‌ జగన్‌కు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జబితా ప్రదర్శించామని అదికారులు  తెలిపారు. 

 

అలాగే సీఎం వైఎస్‌ జగన్‌   ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన ‘దిశ’ చట్టం అమలుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.మహిళా పోలీస్‌ స్టేషన్‌ను   ‘ప్రతి జిల్లాలో బలోపేతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఎక్కడుంది అన్న దానిపై విస్తృత ప్రచారం చేయాలని కూడా ఆదేశించారు. అందులో సిబ్బందిని బలోపేతం చేయాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు  దిశ చట్టాన్ని అమలు చేయడంలో దృష్టిపెట్టాలి.

 

చిన్నారులపై లైంగిక వేధింపులకు గురిచేయడం లాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలి. ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి ప్రభుత్వం చేసిన చట్టాన్ని రాష్ట్రపతి సంతకం కోసం పంపాం. ఈలోగా మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీలు ఓనర్‌షిప్‌ తీసుకుంటే.. మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగుతాయి. ఇందుకోసం అంకితభావంతో పనిచేయాలి అని ఆయన తెలియజేసారు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: