రాజధాని తరలింపు వివాదంలో రైతుల ముసుగులో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. రాజధాని తరలిస్తే తాము ఆత్మహత్యలు చేసుకుంటామని కాబట్టి కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వాలని రాజధాని గ్రామమైన నవులూరులోని రైతులు రాష్ట్రపతికి లేఖలు రాయటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే అమరావతి నుండి రాజధానిని మార్చేస్తే ఆ ప్రాంతంలోని జనాలందరూ ఇక జీవచ్చవాలుగా బతకాల్సిందేనా ?
ఏపి రాజధానికి తాము భూములిచ్చి త్యాగాలు చేసినట్లుగా రైతులు తమ లేఖల్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనతో ఉన్నపళంగా తామంతా రోడ్డున పడినట్లు రైతులు చెప్పటమే విచిత్రంగా ఉంది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చి తాము చేసిన త్యాగాలను జగన్ చాలా తక్కువగా చూస్తున్నట్లు ఆరోపించారు.
ఇక్కడ సమస్యేమిటంటే రైతుల నుండి భూములు తీసుకున్న చంద్రబాబునాయుడు ఏమో చెప్పింది చెప్పినట్లు చేయలేదు. ఆరోజుల్లో రాజధాని ఎందుకు నిర్మించలేదని ఈ రైతుల్లో ఎవరూ చంద్రబాబును నిలదీయలేదు. పైగా చంద్రబాబు రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపిస్తుంటే నోరుమూసుకుని కూర్చున్నారు. తాజాగా అధికారంలోకి వచ్చిన జగన్ రాజధాని పేరుతో వాస్తవాలు చెప్పి చంద్రబాబు చేసినట్లుగా తాను మోసం చేయనని చెప్పారు.
అందుకనే రాజధాని నిర్మాణానికి డబ్బు లేదు కాబట్టి విశాఖపట్నంకు తరలించబోతున్నట్లు ప్రకటించారు. ఎప్పుడైతే రాజధాని తరలింపుపై జగన్ ప్రకటించారో వెంటనే రాజధాని ప్రాంతంలో గోల మొదలైపోయింది. నిజానికి రైతుల ముసుగులో టిడిపి నేతలు, చంద్రబాబు బినామీలు చేయిస్తున్న గోల ఎక్కువగా ఉంది.
ఎందుకంటే రైతుల నుండి భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలు, టిడిపి నేతలు కొనుగోలు చేసేశారు. ఇపుడు రాజధాని తరలింపు జరిగితే రియల్ ఎస్టేట్ దెబ్బ తింటుదన్న గోలే ఎక్కువగా కనబడుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రపతికి రైతులు లేఖలు రాయటం వెనుక కూడా టిడిపినే ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తోంది.