తెలుగుదేశంపార్టీ+ఎల్లోమీడియా విచిత్రమైన వాదనను పదే పదే ప్రచారం చేస్తోంది. అదేమిటంటే రాజధాని తరలింపు, మూడు రాజధానుల ఏర్పాటు, కర్నూలులో హై కోర్టు ఏర్పాటు లాంటి అంశాలేవీ జగన్మోహన్ రెడ్డి పరిధిలో జరిగేవి కావంటూ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే జనాలు నమ్మేస్తారనే భ్రమల్లో ఉంది. తాజాగా టిడిపి రాజ్యసభ ఎంపి కనకమేడల రవీంద్ర చెప్పిన అంశాలను చూస్తే ఎంతగా అబద్ధాలు చెప్పారో అర్దమైపోతుంది.
రాజధానుల ఏర్పాటు అంశం పూర్తిగా రాష్ర్టప్రభుత్వం పరిధిలోని అంశమే అన్న విషయం అందరికీ తెలుసు. ఆ అధికారంతోనే చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. ఇపుడదే అధికారంతోనే జగన్ విశాఖపట్నంకు రాజధానిగా మార్చబోతున్నారు. కాబట్టి ఇందులో కేంద్రప్రభుత్వ ప్రమేయమే ఉండదు. ఈ విషయాన్ని బిజెపి అధికారప్రతినిధి, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు స్పష్టంగా చెప్పారు.
అలాగే కర్నూలు లో హై కోర్టు ఏర్పాటు వరకూ జగన్ అనుకుంటే జరిగేది కాదన్నది వాస్తవమే. ఇందుకు సుప్రింకోర్టు కొలీజియం కూడా అంగీకరించాలి. ఇక జీఎన్ రావు కమిటి చట్టబద్దత గురించి కనకమేడల ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. అప్పట్లో యూపిఏ ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటి నివేదికను కాదని చంద్రబాబు ఏ చట్టబద్దత ఉందని నారాయణతో కమిటి వేశారు ?
కాబట్టి ఒకే అబద్ధాన్ని కనకమేడల పదే పదే చెబితే భయపడేవాళ్ళు, నిజమని నమ్మేవాళ్ళు ఎవరూ లేరన్న విషయాన్ని టిడిపి, ఎల్లోమీడియా తెలుసుకోవటం చాలా మంచిది. విశాఖపట్నాన్ని రాజధానిగా జగన్ దాదాపు నిర్ణయించేశారు. అదే సమయంలో అమరావతి ప్రాంతంలోని రైతులకు ఏ విధంగా లబ్ది చేయాలో సూచనలు చేస్తే ఉపయోగంగా ఉంటుంది. అంతేకానీ జగన్ ను బెదిరిద్దామని ప్రయత్నాలు చేస్తుంటే చివరకు నష్టపోయేది తామే అన్న విషయం రైతులు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.