తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఏ అంశంపైనైనా మాట్లాడగలరు. ఆయన మాటల్లో చతురతతో పాటు సూటిగా, స్పష్టంగా చెప్పే సమాధానాలు కూడా ఉంటాయి. తెలంగాణ రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు.. పరిస్థితులపై ఆయన తన అభిప్రాయాన్ని పైన ఉదహరించిన విధంగానే చెప్పుకొచ్చారు. పలు అంశాలపై ఆయన సమాధానాలు..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్తో తెలంగాణకు మంచి సంబంధాలే కొనసాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతనే తెలంగాణ ఎప్పుడూ పాటిస్తుందని అన్నారు. అలా ఉన్నాం కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయగలిగామని మంత్రి అన్నారు. గోదావరి, కృష్ణాపై ఉమ్మడి ప్రాజెక్ట్ను తాము పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఏ విషయం కూడా ఇరు రాష్ట్ర సీఎంలు ఎక్కడా చెప్పలేదన్నారు. నిజానికి టీడీపీ హయాంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతోనూ, ఏపీతోనూ మంచి సంబంధాలే కొనసాగించామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనేనని ఆయన అన్నారు. కాంగ్రెస్కు ఎంతో చరిత్ర ఉందని, ఎన్నో ఒడిదొడుకులు చూసిన పార్టీ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ను అంత తేలికగా తీసిపారేయడానికి లేదన్నారు. టీఆర్ఎస్ కు దక్కిన విజయాలు చూసి తాము ఎగిరిపడటం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి పరిస్థితేంటో వాళ్ళకే తెలుసన్నారు. తాను చిన్నప్పుడు చూసిన బీజేపీనే ఇప్పుడూ ఉందన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఇదే స్పష్టమైందన్నారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ తప్పుకోవడం వాళ్ల అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలను కాపాడేందుకే కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని మంత్రి అన్నారు. విధి నిర్వహించిన పోలీసు అధికారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు గవర్నర్కు ఫిర్యాదు చేయడం తగదని కేటీఆర్ అన్నారు.