1982 మార్చి 29.. తెలుగు ప్రజల, జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణ అంటూ సినీనటుడు, నటరత్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటి నుంచీ టీడీపీకి.. నందమూరి ఫ్యామిలీకి విడదీయరాని బంధం ఏర్పడింది. అలాగే అప్పటి దాకా సినిమాల్లో అప్రతిహత విజయాలతో దూసుకుపోయిన ఎన్టీఆర్.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమంటూ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అంటే నందమూరి.. నందమూరి అంటే టీడీపీలా మరింది. ఇది ఎప్పుడూ అభిమానుల మదిలో ఉండే మాట.
అయితే ఎన్టీఆర్ తరువాత టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేపట్టగా.. హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న వంటి వాళ్లు టీడీపీ తరపున పోటీ చేయడమో లేక ప్రచారం చేయడమో చేశారు. ఇక నిజానికి ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతిలోకి తీసుకున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ వారసులకు మాత్రం పెద్దగా చేసిందేం లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జాబితాలో మరో నందమూరి వారసుడు కూడా చేరబోతున్నాడని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు విషయంలోకి వెళ్తే.. నేడు నూతన సంవత్సరం సందర్భంగా ఏపి మాజీ సిఎం చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి ఇవాళ రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు.
నిరసనలు తెలుపుతున్న రైతుల కుటుంబాలకు ఆమె సంఘీభావం తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చిన్న కుమారుడు రామకృష్ణ పాల్గొనడం సరికొత్త చర్చకు తెరలేపింది. సాధారణంగా రామకృష్ణ ఏ కార్యక్రమంలోనూ మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ అమరావతిలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాత్రం ఆయన మాట్లాడారు. మరియు అమరావతి రైతుల పరిస్థితి చూస్తుంటే తనకు బాధేస్తోందని రామకృష్ణ.. కండితటి కూడా పెట్టుకున్నారు. దీంతో న్నడూ లేనిది రామకృష్ణ టీడీపీ రాజకీయ ఆందోళన కార్యక్రమానికి రావడం... మాట్లాడటం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.