తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆంధ్రా మంత్రి పేర్ని నాని అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమయంలో కేసీఆర్ ఏపీ ఆర్టీసీ మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పటికే ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జగన్ నిర్ణయించారు. దీనిపై కేసీఆర్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ... ఏపీలో ఏదో చేస్తున్నారు. ఏమైంది.. మన్నయిందా.. అది అయ్యేది లేదు పొయ్యేది లేదు అంటూ తేలిగ్గా తీసుకున్నారు. కానీ అతి తక్కువ కాలంలోనే ఏపీ ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలో విలీనం చేశారు.
జనవరి ఒకటి నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పేర్ని నాని కేసీఆర్ కామెంట్లను గుర్తు చేశారు. కేసీఆర్ ఏమన్నారు.. మన్నవుతుందా.. అన్నారు. మరి ఇప్పుడు మన్నయిందా.. విలీనమైందా అంటూ సూటిగా ప్రశ్నించారు. అనుభవం ముందు సంకల్ప బలం ఇంకా గొప్పదని పేర్ని నాని అన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ధృడ సంకల్పంతోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యమైందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకునే ధృడ సంకల్పం వైయస్ జగన్ది అన్నారు. ఆర్టీసీ కుటుంబం తరఫున సీఎం వైయస్ జగన్ తెగువైన నిర్ణయానికి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆర్టీసీని సంపూర్ణంగా విలీనం చేసేందుకు సీఎం వైయస్ జగన్ కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగంలో, ప్రభుత్వంలో చట్టాలు ఉంటాయి. రూల్స్ ఉంటాయి. కోర్టులు ఉంటాయి. వీటన్నింటిని తప్పుకుంటూ గమ్యం చేరాల్సిన పరిస్థితి. బస్సులో కూర్చున్న ప్రయాణికుడికి ఏం తెలుసు..బస్సు నడిపే డ్రైవర్ బాధలు. బస్సు బయటకు తీసినప్పటి నుంచి దారిలో ఎవడు తాగి వస్తాడో, బాధ్యత లేకుండా ఎవరు నడుతుంటారో అన్న భయంతో ఉంటారు. పద్మవ్యూహ్యం కృష్ణుడి మాదిరిగా ఛేదించాల్సిందే. ఎక్కడా యాక్సిడెంట్ కాకుండా, నిద్రపోకుండా జాగ్రత్తగా ప్రయాణికుడిని గమ్యం చేర్చాలంటే ఎంత ఓపిక ఉండాలో డ్రైవర్కే తెలుసు.. అంటూ ఆర్టీసీ ఉద్యోగులపై ప్రశంసలు కురిపించారు పేర్ని నాని.