దేశంలో రోజురోజుకు మద్యం అమ్మకాలు ఎక్కువైపోతున్నాయి. పండగ రోజు కాకుండా సరే మామూలు రోజుల్లో కూడా అత్యధికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలకు వెళ్లేవారు అయినా సరైన సమయానికి వెళతారో లేదో తెలియదు కానీ.. కరెక్ట్ గా వైన్ షాపులు ఓపెన్ చేసే సమయానికి మాత్రం మందు బాబులు ముందే అక్కడికి చేరుకుంటారు. ఎందుకంటే పొద్దున్నే ఓ పెగ్గు వేయకపోతే చాలా మంది మందుబాబులకు అసలు మైండ్ పనిచేయదు. అందుకే పొద్దున్నే కాస్త మందు వేసిన తర్వాతే విధులకు కూడా వెళ్లే వాళ్ళు చాలామంది. అయితే మద్యం తాగి వాహనం నడిపిన లేకపోతే మద్యం తాగి రోడ్డుమీదకి వచ్చి హంగామా చేసిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు అటువైపు నుంచి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మందు బాబులు మాత్రం మందు మానరు.
అయితే ఈ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు బాగా పెరిగిపోయాయి . మందుబాబులు పోలీసుల నుంచి ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా ప్రతి చోట నిఘా పెడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతుండడంతో దొరికిపోక తప్పడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు అంటే జేబుకు చిల్లు పడాల్సిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాడికి భారీగా ఫైన్ విధిస్తుంటారు పోలీసులు. ప్రస్తుతం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అడుగడుగునా జరుగుతూనే ఉన్నాయి. దీంతో మందు తాగి వాహనం నడవాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. మందు తాగి కిక్కు లో వాహనం నడపడం ఏమో కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికితే మత్రం తాగింది మొత్తం ఒక్కసారి దిగి పోయేలా ఫైన్ లు విధిస్తారు అని భయపడుతున్నారు మందు బాబులు. అయితే రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ లలో దొరికిన వారి సంఖ్య పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.
ఇక ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికీ పోలీసులు భారీగా 10 వేల నుండి 15 వేల వరకు ఫైన్ లు వేస్తున్నారు. అంతే కాకుండా సదురు వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. మందుబాబులు ఆ భారీ ఫైలు కట్టలేక ఏకంగా వారి వాహనాలను కూడా వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మందు బాబులు ఫైన్ లు కట్టలేక వాహనాలు వదులుకోవాలని నిర్ణయం తీసుకుంటూ ఉండడం తో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాహనాలు పోలీస్ స్టేషన్లో వేలాదిగా నిండిపోతున్నాయి. ఇంకేముంది చివరికి కోర్టు నిర్ణయం తీసుకొని పోలీస్ స్టేషన్లలో పేరుకు పోయిన వాహనాలను వేలం వేయాలని పోలీసులు భావిస్తున్నారు.