గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు తెలుగుదేశం పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమస్యల్ని చెప్పేందుకు సీఎంని కలిస్తే అపార్థం చేసుకొని గంటల వ్యవధిలోనే తన నియోజకవర్గంలో ఇంచార్జీని నియమించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసి తనలాంటి వారెందరికో అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే గిరిధర్ ధ్వజమెత్తారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కలిశానని, సీఎంను కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు. ఇంచార్జీ నియామకానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు. ఎందరో పార్టీ మారినా ఆ నియోజకవర్గాలలో అలాగే ఎందుకు నియమించ లేదని నిలదీశారు.
``ముఖ్యమంత్రిని నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశాను. స్థానిక సమస్యలు వివరించాను. సీఎం వెంటనే స్పందించి రూ. 25 కోట్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి దగ్గరకి ఎందుకు వెళ్లారని ఒక్కమాట కూడా అడగకుండా.. ఇంచార్జ్గా మరో వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏంటి?. ప్రజల కోసం సీఎం ని కలిస్తే తప్పేంటి? నా వివరణ కోరకుండా ఇంచార్జ్ని నిమించాల్సిన అవసరం ఏంటి?`` అని గిరి ప్రశ్నించారు.
టీడీపీ ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తోందనే భావన స్పష్టంగా కనిపిస్తోందని గిరి తన లేఖలో పేర్కొన్నారు. ``వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఇంతవరకు ఎందుకు నియమించలేదు?. కోడెల శివప్రసాదరావు నియోజకవర్గంలో ఇంచార్జ్ని ఎందుకు నియమించలేదు? ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తున్నారు. జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే 9 సీట్లు ఒక సామాజిక వర్గానికే కేటాయించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అట్టిపెట్టుకుని ఉంటే ఇదేనా మీ ప్రవర్తన. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన నలుగురు విశాఖ ఎమ్మెల్యేలపై మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. మీ పార్టీలో నాయకులు బయటకు వెళితే వారి ఇళ్ళపైన దాడులు చేస్తారా.? ఈ విషయాలన్నీ మీ అంతరాత్మకే వదిలేస్తున్నాను ’అని లేఖలో పేర్కొన్నారు. కాగా, గిరి లేఖపై తెలుగుదేశం పార్టీ స్పందించలేదు.