ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఆయనతో అనేక విషయాల గురించి చర్చించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన, ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, అదే విధంగా రాజకీయ రంగంలో వస్తున్న మార్పులు, ఇన్సైడర్ ట్రేడింగ్, మూడు రాజధానుల అంశం గురించి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మూడు రాజధానులతో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి సాధిస్తుంది అనే దానిపై కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇప్పుడు మూడు రాజధానుల అంశమే మెయిన్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నారు అని తెలిసిన తరువాత అమరావతిలో రగడ జరుగుతున్నది. దీనికి ప్రధాన కారణం ఏంటి అనే విషయం తెలిసిందే. మూడు రాజధానులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే... రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు అన్నది అందరి ముందున్న ప్రశ్న. ఎందుకంటే మూడు రాజధానులను ఏర్పాటు చేయడం అంటే మాములు విషయం కాదు.
ఇప్పటికే దీనిపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యంగంలో ఎక్కడా ముద్ర మూడు రాజధానుల అంశం గురించి ప్రస్తావించలేదు. అలానే ఉప ముఖ్యమంత్రి పదవుల గురించి కూడా ఎక్కడా లేదు. కానీ, దేశంలోని ఎన్నో రాష్ట్రాలు ఉప ముఖ్యమంత్రులను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే, రాజధాని అని ప్రత్యేకంగా ఆ రాష్ట్రాల్లో ప్రస్తావించలేదు.
ఇప్పుడు ఏపీలో మూడు రాజధానులు అనే సరికి అందరు షాక్ అవుతున్నారు. అంతేకాదు, సచివాలయం మార్చేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 6 సోమవారం రోజున సచివాలయం అమరావతి నుంచి విశాఖకు మార్చాలనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నిర్ణయం ఎంతవరకు సమంజసం అన్నది తెలియాల్సి ఉన్నది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను జగన్ గవర్నర్ కు వివరించారు. జగన్ తో పాటుగా ఆయన సతీమణి భారతీ కూడా ఉన్నారు.