గత కొన్ని రోజులుగా అమరావతికి సంబంధించిన అంశం పెద్దగా గొడవగా మారింది. రాజధానిని తరలిస్తున్నారు అనే విషయాలు బయటకు రావడంతో అనేకమంది నేతలు కామెంట్స్ చేస్తున్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు, పైత్యంతో ఉన్న తమ్మినేని తానేం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలేదని, స్పీకర్పదవి చేపట్టేసరికి ఆయనకి పైత్యంపాళ్లు ఎక్కువయ్యాయని టీడీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దెప్పిపొడిచారు. మూడుపార్టీలు మారినవ్యక్తనే గౌరవంతో జగన్, తమ్మినేనికి స్పీకర్ పదవిచ్చాడని, శ్రీకాకుళంలో ఎవర్ని అడిగినా తమ్మినేని తప్పుడువ్యవహరాలు తెలుస్తాయన్నారు. తెలుగుదేశంలో, పీఆర్పీలో ఉన్నప్పుడు వైఎస్ని, జగన్ని విమర్శించా డని, ఇప్పుడు అదేనోటితో జగన్ భజనచేస్తున్నాడన్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నామన్న ఇంగితంతో సీతారామ్ మాట్లాడితే సహిస్తామని, అలాకాకుండా తానేం మాట్లాడినా చెల్లుతుందనుకుంటే, ఆయన ఒకటంటే, తాము రెండంటామని వెంకన్న తేల్చిచెప్పారు. స్పీకర్ పదవిలో ఉండి, చంద్రబాబు లాంటి సీనియర్నేతపై, రాజధాని రైతులపై ఇష్టానుసారం మాట్లాడటం ఆయనకు తగదన్నారు. చంద్రబాబుని విమర్శించే ముందు చంద్రుడిపై ఉమ్మేస్తే తనపైనే పడుతుందనే నిజాన్ని తమ్మినేనిలాంటివాళ్లు తెలుసుకోవాలన్నారు. సీతారామ్కు నిజంగా తనజిల్లాపై అభిమానం, ప్రేమ ఉంటే, అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని జగన్పై ఎందుకు ఒత్తిడి తేవడంలేదన్నారు.
అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్న వైసీపీ, విచారణజరిపి చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతోందన్నారు. అన్నిప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడుతున్న వైసీపీనేతలు, విశాఖకు రావాల్సిన లులూ, ఆదానీగ్రూప్ వంటి కంపెనీలను, వేలాదిమందికి ఉపాధికల్పిస్తున్న మిలీనియం టవర్స్లోని ఐటీకంపెనీలను తరిమేసినప్పుడు ఎందుకు ఆపలేదని బుద్దా నిలదీశారు. వైసీపీప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్కమిటీలోని సభ్యులకున్న అర్హతలేంటో స్పష్టంచేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లావాసి అయిన తమ్మినేనికి ఆజిల్లానేతలైన ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు చేసిన భూదోపిడీ గురించి తెలియదా అని వెంకన్న ప్రశ్నించారు. విజయనగరంలో బొత్సా సత్యనారాయణ, ఆయనసోదరులు చేసిన భూదందాల సంగతేంటో చెప్పాలన్నా రు. స్పీకర్స్థానంలో ఉన్న తమ్మినేని గౌరవమర్యాదలతో ప్రవర్తించకుంటే ఆయనస్థాయిని ఇతరులు మర్చిపోవాల్సి ఉంటుందన్నారు.