మహారాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. దేశంలో అర్ధంకాని రాజకీయాలకు పరాకాష్ట మహారాష్ట్ర రాజకీయాలు. మహారాష్ట్రలో ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. గతంలో బీజేపీతో పొత్తుపెట్టుకున్న శివసేన 30 ఏళ్ల స్నేహాన్ని పక్కన పెట్టి అధికారం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు కారణంగా మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి పేరుతో కొత్త కూటమి పుట్టింది. ఈ కూటమిలో ఈ మూడు పార్టీలు ఉన్నాయి. అయితే, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇక ఇదిలా ఉంటె, ఉప ముఖ్యమంత్రిగా మరోసారి అజిత్ పవార్ కు అవకాశం దక్కింది. అజిత్ పవార్ మొదట బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్సీపీ పార్టీని చీల్చాలని చూశారు. కానీ, ఎన్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు శరద్ పవార్ వైపు ఉండటంతో ఆ కూటమి కూలిపోయింది. ఆ తరువాత మహా వికాస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటీవలే మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ను మరోసారి నియమించారు. అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా ఆర్థికశాఖ మంత్రి పదవిని కూడా అప్పగిస్తున్నారు.
ఇది డబుల్ బొనాంజా అని చెప్పాలి. ఎందుకంటే అజిత్ పవార్ మీద ఆర్థికపరమైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. గతంలో సిబిఐ విచారణ కూడా జరిగింది. అలాంటి అజిత్ పవర్ కు తీసుకెళ్లి ఉద్దవ్ థాకరే ఆర్థికశాఖ మంత్రి పదవిని అప్పగించారు. ఇది నిజంగా షాక్ ఇచ్చే అంశం అని చెప్పాలి. మొత్తం 26 మంది కేబినెట్ మంత్రులు కాగా, మరో 10 మంది సహాయ మంత్రులుగా పదవిని చేపట్టారు.
వీటితో పాటుగా కీలకమైన హోమ్ శాఖ, నీటిపారుదల శాఖను కూడా ఎన్సీపీకి కేటాయిస్తోంది శివసేన. అటు కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలక పదవులు కోరింది. అందులో రోడ్లు భవనాలు, వ్యవసాయ శాఖను కోరింది. దీనిపై ఉద్దవ్ థాకరే తన నిర్ణయం తెలియజేయాల్సి ఉన్నది. ఇకపోతే, ఉద్దవ్ తన కుమారుడు ఆదిత్య థాకరేకు పర్యాటక శాఖను కేటాయించారు. గతంలో ఆయన కోసం ఉద్దవ్ థాకరే ప్రత్యేకంగా సిఎంవో మంత్రిత్వ శాఖ అనే శాఖను క్రియేట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ, అవి నిజం కాదని తేలిపోయింది.