మున్సిపోల్స్‌ రణతంత్రంపై గులాబీ బాస్ కేసీఆర్ దృష్టి సారించారు. పురపోరులో అనుసరించాల్సిన వ్యూహలపై నేత దిశానిర్ధేశం చేసేందుకు తెలంగాణ సీఎం కేసిీఆర్ శనివారం పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మున్సిపోల్స్ యాక్షన్ ప్లాన్ ను కేసీఆర్ ఖరారు చేయనున్నారు. అభ్యర్ధుల ఎంపిక మొదలు.. అసంతృప్తుల బుజ్జగింపుల వరకు ఏం చేయాలో నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు  కేసీఆర్.

 

మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ కసరత్తును వేగవంతం చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్ లు, కార్పొరేషన్ చైర్మన్ లతో పాటు పలువురు నేతలను పార్టీ ఈ సమావేశాలకు ఆహ్వానించింది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రాథమికంగా మున్సిపోల్స్ పై చర్చించారు. శనివారం నాలుగైదు గంటల పాటు జరిగే సమావేశంలో మున్సిపోల్స్ పై లోతుగా చర్చించి.. గెలుపు వ్యూహాలను కేసీఆర్ ఖరారు చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

 

మున్సిపల్ ఎన్నికలకు సిద్దం అయ్యే క్రమంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సీనియర్ నేతలను ఇంచార్జీలుగా నియమించింది టీఆర్ఎస్. 120 మున్సిపాలిటీలు,10 కార్పొరేషన్ లలో ఉన్న రాజకీయ పరిస్థితులు, బలాబలాలు, సమస్యలపై నివేదిక సిద్దం చేసిన ఇంచార్జీలు ఇప్పటికే పార్టీకి అందచేశారు. విస్తృత స్థాయి సమావేశంలో ఈ నివేదికలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల వారీగా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాల్సిన అంశాలు, అభ్యర్ధుల ఎంపికకు సంబంధించిన సూచనలు, సలహాలు.. రెబల్స్ తో వ్యవహరించాల్సిన తీరు.. లాంటి అంశాలపై నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పనిచేసేందుకు మరికొంత మంది సీనియర్లకు కూడా బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 

జెడ్పీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న టీఆర్ఎస్.. మున్సిపోల్స్ లో కూడా అదే స్థాయిలో ఫలితాలను రాబట్టుకోవాలనుకుంటోంది. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం తర్వాత టీఆర్ఎస్ వ్యూహలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: