రాజధాని ప్రాంత రైతులకు పోలీసుల వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయి .ఇప్పటికే అర్ధరాత్రి , అపరాత్రి అన్నతేడా లేకుండా ఇళ్లపై పడి పోలీసులు వేధిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా , కారుణ్య మరణాలు కోరుతూ రాష్ట్రపతి కి లేఖలు రాసిన రైతుల్ని విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడం హాట్ టాఫిక్ గా మారింది . విచారణ నిమిత్తం రాజధాని ప్రాంతమైన తుళ్లూరు పోలీసు స్టేషన్ కు కాకుండా , గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసు స్టేషన్ కు హాజరుకావాలని ఆదేశించడం పట్ల రైతులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు .
వెలగపూడి , మల్కాపురం గ్రామాలకు చెందిన రైతులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు , విచారణ నిమిత్తం తమ ఆధార్ కార్డు వెంట తీసుకుని చిలకలూరిపేట పోలీసు స్టేషన్ కు హాజరుకావాలని పేర్కొంటూ షాకిచ్చారు . ఇప్పటికే 15 మంది రైతులు , రైతు కూలీలకు ఈ మేరకు పోలీసుల నోటీసులు అందాయి . రాజధానిని అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించవద్దని కోరుతూ గత 17 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు , నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెల్సిందే . రోడ్లపై బైఠాయించడమే కాకుండా , వంటావార్పు కార్యక్రమాల ద్వారా తమ నిరసనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు .
అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం తో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చి రోడ్డున పడ్డామని , తమకు , తమ పిల్లలిక భవిష్యత్తు లేదని పేర్కొంటూ , కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని పలువురు రాష్ట్రపతికి లేఖలు రాసి సంచలనం సృష్టించారు . రాష్ట్రపతికి ఎవరైతే కారుణ్య మరణాలకు అనుమతించాలని కోరుతూ , లేఖలు రాశారో పోలీసులు వారికి నోటీసులు జారీ చేసి , విచారణ నిమిత్తం తమ గ్రామాలతో ఏమాత్రం సంబంధం లేని చిలకలూరి పేట పోలీసు స్టేషన్ కు హాజరుకావాలని ఆదేశించడం పట్ల అన్నదాతలు మండిపడుతున్నారు .