యాంకర్ శ్రీముఖి మరో ఆసక్తికరమైన వార్తతో తెరమీదకు వచ్చారు. ‘బిగ్బాస్’ షోలో పాల్గొనడం కోసం తనకు ఎంతో గుర్తింపు ఇచ్చిన ‘పటాస్’ నుంచి బయటికొచ్చి...బిగ్బాస్ అయిపోయిన అనంతరం...అభిమానులను నిరీక్షణలో ఉంచిన శ్రీముఖి తాజాగా మొక్కలు నాటే కార్యక్రమంలో కనిపించింది. టీఆర్ఎస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం భాగంగా శ్రీముఖి జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు. ప్రముఖ సింగర్ మంగ్లీ మొక్కలు నాటి జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్, యాంకర్ శ్రీ ముఖి, జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్ తదితరులకు విసిరారు. దాన్ని స్వీకరించిన శ్రీముఖి తాజాగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుందన్నారు. ``ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని నా తరపున కోరుతున్నాను. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమంను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాతావరణ కాలుష్యం వల్ల నా స్నేహితులు చాలా మంది వారి పిల్లలను ఇతర దేశాలకు తీసుకెళ్లి అక్కడే స్థిరపడి పోదాం అనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనమందరం కలిసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది.`` అని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలిచారని ప్రశంసించారు. తన తరపున మరో ముగ్గురికి వితిక, జానీ మాస్టర్, యాంకర్ రష్మి లను మొక్కలు నాటాలని కోరారు. అదేవిధంగా టీవీ చూస్తున్న ప్రేక్షకులు ప్రతి ఒక్కరు స్వతహాగా మొక్కలు నాటాలని కోరుతున్నాను అని అన్నారు.
‘బిగ్బాస్’ ఆఫర్ ఇచ్చిన ‘స్టార్ మా’ చానెల్ లోనే యాంకర్ గా శ్రీముఖి కొత్త షో చేస్తుంది. అయితే ఈ షో ఏంటి అనే వివరాలు తెలియకుండా ‘స్టార్ మా’ ఒక ప్రోమో విడుదల చేసింది. ‘యువర్ లౌడ్ స్పీకర్ ఈజ్ బ్యాక్’ అంటూ ఒక కొత్త షోతో ముందుకు రానున్నట్లు శ్రీముఖి ఈ ప్రోమోలో చెప్పింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇది ‘స్టార్ట్ మ్యూజిక్’ అనే షో కావొచ్చనుకుంటున్నారు.ఈ షో మొదటి సీజన్కు సీనియర్ యాంకర్ ఝాన్సీ హోస్ట్గా చేసింది. రెండో సీజన్కు శ్రీముఖి చేసే అవకాశం ఉంది.