న‌లుగురు మృగాళ్ల రాక్ష‌స చ‌ర్య దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. అలాగే వారి చావు కూడా అంతే క‌ల‌క‌లం రేపింది. ఇదంతా హైద‌రాబాద్‌లో జ‌రిగిన దిశ అత్యాచారం, హ‌త్య‌, అనంత‌రం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ గురించి. మ‌హిళ‌ల భ‌ద్ర‌త గురించి అనేక అనుమానాలు కలిగించేలా దేశమంతా భావించిన ఈ ఘ‌ట‌న‌లో ఇంకా విచార‌ణ కొన‌సాగుతోంది. ఇటీవ‌లే నిందితుల అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. అయితే, ఈ విస్మ‌య‌క‌ర ఘ‌ట‌న‌ల‌పై ఇంకా వివాదం చెల‌రేగుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్రంగా ఊహించ‌ని ఘ‌ట‌న ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఈ మేర‌కు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

 


హైద‌రాబాద్‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించిన మంద‌కృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు. ``మనుషులు కొన్ని సందర్భాల్లో మృగాలు గా మారతారు...ప్రభుత్వం కొన్ని సమయాల్లో కటినంగా వ్యవహరించాల్సి వస్తుందని మాజీ డీజీపీ హెచ్ జే దొర అత్మకథ పుస్తకావిష్కరణ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు సరికాదు. సీఎం కేసీఆర్ దిశ నిందితులను కాల్చి చంప‌డాన్ని సమర్ధించినట్లు మాట్లాడారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సీఎం పరోక్షంగా, ప్రత్యేకంగా సమర్తించినట్టుగా ఉంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణ చేయాలి.` అని డిమాండ్ చేశారు.

 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ వెనక త‌మ నాయకుడు తీసుకున్న నిర్ణయం ఉందని మంత్రి తలసాని అన్నార‌ని ఈ సంద‌ర్భంగా మంద‌కృష్ణ గుర్తు చేశారు. ``దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ నిండు అసెంబ్లీలో అభినందించారు. వీటి ప్ర‌కారం, ప్రభుత్వ నిర్ణయంతో ఎన్‌కౌంటర్ జరిగింది అనేది తెలుస్తుంది. కఠిన నిర్ణయాలు చట్టానికి లోబడి మాత్రమే తీసుకోవాలి. చట్ట బద్ధంగా చేయకుంటే అవీ హత్యల కిందకే వస్తాయి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పోలీసులే నిందితులు అయినా వాళ్లకు కేసీఆర్ ఆదేశాలు ఉన్నాయి.` అని దుయ్య‌బ‌ట్టారు.

 

ప్రజాస్వామ్యం మీద...రాజ్యాంగం పై గౌరవం ఉన్న వాళ్ళు ఇలా చేయరని మంద‌కృష్ణ పేర్కొన్నారు. ``రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాలు సీఎం కు కనబడటం లేదా? దిశ నిందితులను ఎన్కౌంటర్ చేస్తే మంచి పేరు వస్తుందని సీఎం కలలు కన్నారు. మానవహక్కుల కు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తాం`అని మంద కృష్ణ అన్నారు. అణగారిన వర్గాలపై ప్రభుత్వం చూపుతున్న వివక్ష పై మార్చి 8 తేదీన కొంగరకలన్‌లో ఎస్సీ-ఎస్టీ యుద్ధ భేరీ సభ నిర్వహిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: