దాదాపు గంటపాటు జరిగిన విలేకరుల సమావేశంలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలోని సారాంశం స్పష్టమైంది. ఇందులో పలు ప్రధాన నిర్ణయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ అభివృద్ధి కోణంలో రాజధాని తరలింపు అనివార్య అంశమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక పేర్కొంది. మూడు ఆప్షన్లు ఇచ్చిన కమిటీ ఇందులో విశాఖనే సరైన ప్రత్యామ్నాయం అని ప్రకటించింది. ఎందుకు సరైనదో ఈ సందర్బంగా వెల్లడించింది.
విశాఖపట్టణం నుంచి చెన్నై వరకూ రోడ్ కనెక్టివిటీ ఉందని బీసీజీ రిపోర్ట్ వెల్లడించింది. విశాఖలో మాత్రమే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. విశాఖలో మాత్రమే పోర్టులు అభివృద్ధి చెంది ఉన్నాయని బీసీజీ వెల్లడించింది. విశాఖ పర్యాటక రంగంలో టాప్లో ఉందని తెలిపింది. ఇలా విశాఖకు అనేక అనుకూలతలు ఉన్నాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక విశ్లేషించింది. గవర్నర్, సీఎం కార్యాలయం, తాత్కాలిక అసెంబ్లీ విశాఖలో ఏర్పాటు చేసుకోవచ్చునని వెల్లడించింది. దీంతో పాటుగా వివిధ అనేక అంశాలను వివరించింది. కృష్ణా, గోదావరి బేసిన్లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా ఉందని బీసీజీ వెల్లడించింది. రాష్ట్రానికి ప్రకృతి సంపద ఉన్నప్పటికీ సరిగా ఉపయోగించుకోలేదని వెల్లడించింది. 8 జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధి చాలా తక్కువగా ఉందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వ్యవసాయం, పారిశ్రామిక రంగం, టూరిజం, మత్స్య రంగాల్లో ప్రణాళికలను బోస్టన్ నివేదికలో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్ఫీల్డ్ మెగా సిటీలు, వాటి ఆర్థిక పనితీరును నివేదికలో ప్రస్తావించిన బీసీజీ.. అవన్నీ అనుకున్న లక్ష్యాలను సాధించాయా? లేదా? అన్నదానిపై గణాంకాలతో తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, జీఎస్ రావు కమిటీ, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికలను పరిశీలించి మరో రిపోర్టు ఇవ్వడానికి హై కమిటీ ఏర్పాటు చేశారు. ఆ హైపవర్ కమిటీ 6న సమావేశం కానుంది. ఈ సమావేశంలో తుది నిర్ణయం వెల్లడించనుంది.