మనిషిగా పుట్టిన ప్రతి వారు మహనీయులుగా పిలువబడరు. ఈ భూమి మీద మనుషులతో పాటుగా ఎన్నో ప్రాణులు జన్మను పొందుతున్నాయి. అవి తమ పని తాము చేసుకుంటూ తమ జన్మను చాలిస్తున్నాయి. కానీ మనిషి అని చెప్పబడే జీవి మాత్రం తనకు తానే గొప్ప అని భావించుకుని తనతో పాటుగా, ఇతర ప్రాణులకు కూడా తెలిసి హాని తలపెడుతున్నాడు. ఆకలితో అలమటించే వారు కనిపించినా కూడా కొందరు చూస్తూ వెళ్లుతారే తప్ప కనీసం మానవత్వంతో అయినా సహయం చేయరు.
ఇక మరికొందరు ఓ వంద రూపాయలు దానం చేస్తే వందేళ్లు చరిత్రలో నిలిచిపోయేలా గొప్పగా చెప్పుకుంటారు. ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయం ఏంటంటే తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు ఏం తెచ్చాం. పుడమి ఒడిలో ఒదిగి మట్టిలో కలిసేటప్పుడు ఏం తీసుకెళ్లుతాం. అంటే నీది అని చెప్పుకునే ప్రతీది నీది కాదు. మరి అలాంటప్పుడు ఈ పని నేను చేస్తున్నా అని ఎందుకు భావించుకుంటాడో మనిషి. ఇకపోతే లోకంలో ధనవంతులకు కొదువే లేదు. అలాగే ఒక్క పూట అన్నంకోసం అలమటించే వారు కూడా తక్కువగా లేరు.
నీకున్న దాంట్లో ఒక్క పావు వంతు దానం చేస్తే నీ కీర్తి పెరుగుతుందే తప్పా తరగదు. ఇలాగే భావించిందేమో ఓ అమ్మ తనకు వచ్చిన దాంట్లో భగవంతుడు ఇచ్చిన దాంట్లో నుండి చేసిన సహాయం ఏందరో పేదలకు ఇప్పుడు నీడలా మారబోతుంది. ఇంత మంచి మనసున్న ఆ అమ్మ పేరు మీరా నాయుడు. ఇకపోతే బెంగళూరు హైటెక్సిటీలో ఉన్న గాంధీనగర ఉండే భూమి బంగారంతో సమానం. ఒక్క అడుగు భూమి విలువ లక్షల్లోనే ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో ఉన్న తన భూమిని క్యాన్సర్తో బాధపడే బాలల సంక్షేమం కోసం ఓ దానగుణ సంపన్నురాలు కేటాయించి తన దొడ్డమనసును చాటుకుంది.
మెజిస్టిక్ ప్రయాణ ప్రాంగణానికి చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో భూమి విలువ ప్రస్తుత పరిస్దితుల్లో రూ.300 కోట్ల ధర పలుకుతుందట. ఇక గాంధీనగరలో ఉన్న ఈ ‘లక్ష్మీ హోటల్’ త్వరలో ‘లక్ష్మీ బాలల ఆరోగ్య కేంద్రం’గా మారనుంది. హోటల్ యజమాని మీరా నాయుడు ఆ హోటల్ను పేద బాలల కోసం దానం చేశారు. రూ.300 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకు వచ్చినా ఆమె తిరస్కరించి, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే క్యాన్సర్ పీడిత పేద బాలల కోసం ఆ భవనాన్ని కేటాయించాలని నిర్ణయించారు.
పేదలకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తున్న నగరంలోని శంకర్ ఆసుపత్రికి మీరా నాయుడు దానిని ఇచ్చేశారు. ఇక మూడు అంతస్తుల ఈ భవనంలో 32 గదులున్నాయి. ప్రతి అంతస్తులో కొత్తగా వంటశాల నిర్మిస్తారు. చికిత్స కోసం వచ్చే బాలలు, వారి తల్లిదండ్రులు ఉచితంగా అక్కడే ఉండి, వైద్యసేవల అనంతరం తిరిగి వెళ్లవచ్చని ఆమె వివరించారు. త్వరలోనే సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు..