తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై ఇప్పటికే అన్ని పార్టీలు సర్వసన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు కోర్టు తీర్పు ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ...మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రచారాలు సాగుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. దాదాపుగా ఉదయం 12 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం వరకు జరగనుంది. దీంతో కేసీఆర్ ప్రసంగం, ఈ సమావేశంపై ఉత్కంఠ వ్యక్తమవుతోంది.
మున్సిపోల్స్కు ఈ నెల 7న నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సుదీర్ఘంగా కొనసాగే ఈ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి భోజనం చేయనున్నారు. తెలంగాణభవన్లోసీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లను ఆహ్వానించారు. సుదీర్ఘంగా కొనసాగే ఈ సమావేశంలో మున్సిపల్ చట్టాన్ని సమర్థంగా అమలుచేయడం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, ప్రచార ప్రణాళికపై వివరించనున్నారు.
మున్సిపల్ చట్టాన్ని సమర్థంగా అమలుచేయడం, ప్రభుత్వ ఆలోచనలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. జిల్లా పార్టీ ఆఫీస్లను ప్రారంభించి నాయకులకు శిక్షణ ఇవ్వడంపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రభుత్వ పథకాలపై చర్చించే అవకాశం ఉంది. వీటితోపాటు సమకాలీన రాజకీయ అంశా లు, ప్రభుత్వ పథకాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా, మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఇప్పటికే పలుమార్లు సమీక్షా సమావేశాలను నిర్వహించి అత్యధిక స్థానాల్లో గెలిచేలా వ్యూహాన్ని సిద్ధం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలు, మున్సిపాలిటీలవారీగా ఇంచార్జీలను నియమించి నివేదికలు తెప్పించుకున్నారు. ఈ నివేదిక గురించి సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది.