ఒకప్పుడు పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగి తన నటనతో గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. ప్రస్తుతం 13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ చేస్తున్నారు విజయశాంతి. అయితే తాజాగా విజయశాంతి ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. పిల్లలు అంటే తనకు ఎంతో ఇష్టమని పిల్లలను కంటే తన స్వార్థం పెరుగుతుందని ఆలోచించిన మీదటే పిల్లలు వద్దు అని నిర్ణయం తీసుకున్నాను అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా అన్న స్వార్ధాన్ని వదిలేసి మన అన్న ధోరణితో సాగాలని తాను భావించినట్లు విజయశాంతి చెప్పుకొచ్చారు.
తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలందరికీ మంచి చేయాలనీ అనుకున్నానని... నా ఆలోచనకు నా భర్త నుండి ప్రోత్సాహం లభించిందని తెలిపారు.ఇద్దరం కలిసే పిల్లలు వద్దనుకుని నిర్ణయం తీసుకున్నామని విజయశాంతి తెలిపారు. అనుకోకుండా తన భర్త శ్రీనివాస ప్రసాద్ తో పరిచయం ఏర్పడిందని... మా అభిప్రాయాలు చెప్పిన తర్వాత పెళ్ళిచేసుకోవాలని అనుకున్నామని విజయశాంతి తెలిపారు . కోట్లు ఖర్చుపెట్టి పెద్దపెద్ద మండపాల్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని భావించలేదని... అందుకే సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నామని తెలిపారు ఆమె . స్నేహితుల సమక్షంలోనే తన మెడలో ఆయన తాళి కట్టారు అంటూ చెప్పుకోచ్చారు. ఒకరిపై ఒకరికి మంచి నమ్మకం ఉందని...ఇందిరా గాంధీ జయలలిత లాగా అవ్వాలన్న కోరిక ఉంది అని విజయశాంతి వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తనకు రాజకీయాలే ముఖ్యమని సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదు అంటూ చెప్పారు విజయశాంతి. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రం చేసే అవకాశం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఇకపోతే విజయశాంతి 13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.