తల్లి కి మించిన దైవం ఈ ప్రపంచంలో కనిపించదు. తల్లి ఎక్కడైనా సరే తల్లే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి తల్లి తన బిడ్డను విడిచిపెట్టదు. తల్లి తన బిడ్డ కోసం ఎంతగా తపిస్తుందో చెప్పక్కర్లేదు. తల్లి తపన ముందు మిగతా మొత్తం శూన్యం అనే చెప్పాలి. అది మనిషి కావొచ్చు. జంతువూ కావొచ్చు. ఎవరైనా సరే ఒక్కటే. తాను చనిపోతున్నా తన బిడ్డను బ్రతికించుకోవాలనే ఆరాటం ప్రతి తల్లికి ఉంటుంది. అలా తల్లికి ఉండే తపనకు ఈ ఫోటోనే ఓ ఉదాహరణ అని చెప్పొచ్చు.
సంగారెడ్డి జిల్లాలోని నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే హైవే పై గుమ్మడిదల గ్రామ శివారు వద్ద అడవి ప్రాంతం కావడంతో అక్కడ అనేక వన్యప్రాణులు జీవిస్తుంటాయి. ఇవి తరచుగా ఆహారం కోసం రోడ్డుమీదకు వస్తుంటాయి. అలా రోడ్డుమీదకు వచ్చినపుడు అటుగా వెళ్లే వ్యక్తులు ఏదైనా ఆహారం పెడితే తింటుంటాయి. ఇలా రోడ్డుమీదకు వచ్చిన ఓ తల్లికోతిని ఓ వాహనం ఢీకొట్టింది.
దీంతో తలకు గాయం అయ్యి రక్తం కోరుతున్నది. అయినా సరే ఆ రోడ్డుపక్కన ఉన్న తన బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే చూసి తట్టుకోలేకపోయింది. బాధను దిగమింగుకుంటూ వెళ్లి బిడ్డకు పాలు ఇచ్చింది. బిడ్డ ఆకలి తీరుస్తుంటే... తన బాధను మొత్తం మర్చిపోయినట్టుగా ఉన్నది. అటుగా వెళ్తున్న కొంతమంది వ్యక్తులు ఈ దృశ్యాలను ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది ఈ ఫొటోకే అత్యత్తుమ ఫోటోగా అవార్డు వస్తుందని కొంతమంది అంటున్నారు. అవార్డు తరువాత సంగతి ఆ కోతికి వైద్యం చేయిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా లేదా అన్నది తెలియడం లేదు. ఎందుకంటే ప్రాణి ఏదైనా ప్రాణే కదా. దెబ్బ ఎవరికైనా సరే దెబ్బె కదా. దెబ్బతగిలినపుడు ఎలా మనం ఇబ్బందులు పెడతామో... అలానే అందరు కూడా ఇబ్బందులు పడతారు. అందులో సందేహం అవసరం లేదు.