ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చనే ప్రకటన చేసినప్పటి నుండి ప్రజల్లో, రాజకీయ నేతల్లో మూడు రాజధానుల గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నివేదికలను అందించిన జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కమిటీలు ఏపీలో మూడు రాజధానులకు అనుకూలంగానే నివేదికలు ఇచ్చాయి. ప్రభుత్వానికి త్వరలో హైపవర్ కమిటీ ఈ రెండు నివేదికలను పరిశీలించి తుది నివేదిక ఇవ్వనుంది.
 
హై పవర్ కమిటీ నివేదిక తరువాత అధికారికంగా ఏపీకి మూడు రాజధానుల దిశగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రజలు, రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జగన్ నియమించిన కమిటీలు జగన్ ఆదేశాల మేరకే నివేదికలను ఇస్తాయని అన్నారు. 
 
ఈరోజు విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వానికి ఇష్టారీతిన రాజధానిని మార్చే హక్కు లేదని రాజధానిని మార్చటానికి స్టేక్ హోల్డర్స్ ఆమోదం కావాలని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతి విషయంలో తమ పార్టీకి భిన్నాభిప్రాయాలు లేవని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 
 
 బీజేపీ పార్టీ రాజధాని విషయంలో చూస్తూ ఊరుకోదని కన్నా అన్నారు. కేంద్రానికి రాష్ట్ర రాజధాని అంశంతో ఎటువంటి సంబంధం లేదని కన్నా తెలిపారు. సలహాలు, సూచనలకు మాత్రమే కేంద్రం పరిమితమవుతుందని కన్నా స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయం ఉంటుందని అన్నారు. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయటానికి గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయని చెప్పారు. వైసీపీ పార్టీ నేతలు టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందిస్తున్నారు కానీ బీజేపీ నేతల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరి కన్నా వ్యాఖ్యల పట్ల వైసీపీ పార్టీ నేతలు స్పందిస్తారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: