టీడీపీ అధినేత మరోసారి నోరు జారారు. బీసీజీ నివేదికపై ఆవేశంగా ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. ప్రణాళిక సంఘం అధికారి విజయ్ కుమార్ పై నోరు పారేసుకున్నారు. వాడు.. వీడు అంటూ ఓ ఐఏఎస్ ను సంబోధించారు. అమరావతి నుంచి రాజధాని మార్పుపై విపరీతమై ఆగ్రహంలో పాపం.. మనసులో మాటలు ఫిల్టర్ లేకుండానే బయటకు వస్తున్నట్టున్నాయి. చివరకు ఐ ఏ ఎస్ అధికారులను కూడా ఇష్టానుసారం సంభోదించడం వివాదాస్పదం అవుతోంది.

 

చంద్రబాబు గతంలోనూ ఇలా దళితులపై నోరు జారి చిక్కుల్లోపడ్డారు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీటవుతుంది. ఈ అవకాశాన్ని వైసీపీ వదులుకుంటుందా.. దీంతో వైసీపీ నాయకులు ఓ రేంజ్ లో చంద్రబాబుపై మాటల దాడి చేస్తున్నారు. దళిత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు.

 

దళితులకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. విజయ్‌కుమార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బరి తెగించి ఆయన మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయ్‌కుమార్‌ను విమర్శించడం ద్వారా తన కుల దురహంకారాన్ని చంద్రబాబు మరోసారి బయట పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. ‘దళిత అధికారులంటే చంద్రబాబుకు చులకన భావం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన ఏకైక నాయకుడు’ అని ధ్వజమెత్తారు. దళితులపై చంద్రబాబు అనేక సార్లు దాడులు చేయించారని.. దళితుల భూములను దోచుకున్నారని దుయ్యబట్టారు.

 

దళిత ఐఏఎస్ అధికారిపై నోరు పారేసుకున్న చంద్రబాబు పై ఎస్సీ,ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టాలన్నారు నాగార్జున. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం దళితులను అవమానించడమేనా అని ప్రశ్నించారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు గతంలో కూడా దళితులను అవమానించారని గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు తలుచుకుంటే చంద్రబాబు రోడ్లపై తిరగలేరని మేరుగ నాగార్జున హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: