గతేడాదిని అందరిని ఏడిపించింది ఉల్లి. అప్పటి వరకు వంటింట్లో కోసి కన్నీళ్లు పెట్టించిన ఉల్లి, ఆ తరువాత కోయకుండానే కన్నీళ్లు పెట్టించింది. ఈ కన్నీళ్లతో దేశంలోని ప్రజలు గగ్గోలు పెట్టారు. దేశంలో ఉల్లి రేటు పెరిగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి వర్షాలు. వర్షాలు భారీగా కురవడంతో రావాల్సిన పంట చేతికి రాలేదు.
పైగా దేశంలో గిడ్డంగుల్లో ఉన్న నిల్వలు తరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రూ. 20కి దొరికే ఉల్లి క్రమంగా రేట్లు పెరిగిపోయాయి. క్రమంగా ఉల్లి ధరలు పెరిగి రూ. 50, రూ. 100, రూ. 200 ఇలా పెరుగుకుంటూ వెళ్ళింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే, పెరుగుతున్న ఉల్లిని తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఉల్లిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఎగుమతులను ఆపెయ్యడమే కాకుండా, ఉల్లిని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. టర్కీ నుంచి దిగుమతి చేసుకుంది. దీంతో కొంతవరకు సమస్య తీరింది. కొన్ని ప్రాంతాల నుంచి ఉల్లి కొంతవరకు మార్కెట్ కు రావడంతో ఈ సమస్య కొంతవరకు తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే ఉల్లి ధరలు తగ్గుతున్నాయి. ఇకపోతే ఉల్లి ధరలు తగ్గుతున్న సమయంలో మరొకటి ఇబ్బంది పెట్టేందుకు సిద్ధం అయ్యింది. అదే ఎండుమిర్చి. ఎండు మిర్చి కేజీ ధర ఇంతకు ముందు రూ. 90 వరకు ఉండేది.
కానీ, ఇప్పుడు ఈ ధర క్రమంగా పెరిగిపోతున్నది. నాలుగు రోజుల్లోనే ఈ ధర ఆకాశాన్ని తాకింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ ఎండుమిర్చి ధర ఏకంగా రూ. 240 కి చేరింది. ఇలా రూ. 240 కి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లి ఏడిపించి ఇప్పుడు ఎండుమిర్చి ఏడిపిస్తుండటంతో అసలు కొనాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయారు ప్రజలు. మరి దీనిపై ఎలా ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. గత కొన్నాళ్లుగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం కొండెక్కుతున్నాయి.