రాజధాని తరలింపు వ్యవహారం పై కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పి , ఏపీ బీజేపీ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు . రాజధాని ఎక్కడ ఉండాలనేది నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు . ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంశం లో తాము జోక్యం చేసుకోబోమని చెప్పారు . అయితే రాజధాని తరలింపు వ్యవహారంపై కేంద్రం చూస్తూ ఊరుకోదని , కేంద్ర పెద్దలే ఈ విషయాన్ని తనకు చెప్పారని ఇటీవల రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పేర్కొన్న విషయం తెల్సిందే .
తాజాగా అనంతపురం లో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, సుజనా చౌదరి చెప్పినదాంట్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం అవుతోంది . రాజధాని తరలింపు వ్యవహారంపై బీజేపీ నేతలు ఒక విధానమంటూ లేకుండా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల్నే కాకుండా క్యాడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నారు . రాజధాని తరలింపు వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ సభ్యుల మధ్యే బిన్నా భిప్రాయాలున్నట్లు వారి వ్యాఖ్యలను పరిశీలిస్తే స్పష్టం అవుతోంది . రాజధాని వ్యవహారం లో సుజనా చౌదరి , జివిఎల్ నర్సింహారావు లు పరస్పరం బిన్నా భిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు .
ఒక రాజధాని తరలింపును వ్యతిరేకిస్తే , మరొకరు రాజధాని తరలింపు వ్యవహారం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని పేర్కొంటున్నారు . జివిఎల్ కు మద్దతు అన్నట్లుగా సీఎం రమేష్ ఆయన అభిప్రాయాన్ని బలపర్చగా , ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , సుజనా చౌదరి దన్నుగా నిలుస్తుండడం చూస్తుంటే రాష్ట్ర కమలనాథులు రెండుగా చీలిపోయినట్లు కన్పిస్తోందన్న వాదనలు సర్వత్రా విన్పిస్తున్నాయి . అయితే పార్టీ విధానానికి అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని ఏమి లేదని తేల్చి చెప్పి కిషన్ రెడ్డి , రాష్ట్ర నేతల అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు .