చిత్తూరు జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో గ్రూప్ విభేదాలు భగ్గుమన్నాయి . ఎమ్మెల్యే రోజా , పార్టీ కీలక నేత అమ్ములు వర్గం బాహాటంగానే ఢీ అంటే ఢీ అంటున్నారు . ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు . ఈ నేపధ్యం లో నగరి ఎమ్మెల్యే రోజా సంచలన ఆరోపణలు చేసింది . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనని సొంతపార్టీ నేతలే ఓడించడానికి ప్రయత్నించారని వెల్లడించింది .
నగరి నియోజకవర్గ పరిధిలోని కేబీఆర్ పురం వెళ్లగా , స్థానిక వైస్సార్ కాంగ్రెస్ నేతలు రోజాను గ్రామంలోకి రానీయకుండా అడ్డుకోవడమే కాకుండా , ఆమె కారును కూడా ధ్వంసం విషయం తెల్సిందే . ఈ విషయమై రోజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమ్ములు వర్గానికి చెందిన పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా పెద్ద నాయకుల సహకారం తో , అమ్ములు వర్గం తనని ఓడించడానికి ప్రయత్నం చేసిందని , అయినా తాను విజయం సాధించడం జీర్ణించుకోలేకనే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని రోజా ఆరోపించడం హాట్ టాఫిక్ గా మారింది.
పార్టీ నాయకత్వం కూడా ఇటువంటి వారిని ఉపేక్షిస్తోందని తాను భావించడం లేదన్నారు . కేబీఆర్ పురం లో గ్రామ సచివాలయం ఏర్పాటులో వారికేమైనా అభ్యంతరాలు ఉంటే నగరిలోనే తన ఇల్లు ఉందని వచ్చి మాట్లాడవచ్చునని చెప్పారు . అంతేకాని ఒక మహిళ అని కూడా చూడకుండా , తాను కారులో ఉండగానే దాడి చేయడం హేయనీయమైన చర్య అని రోజా మండిపడ్డారు . కార్యకర్తలు ఎవరైన నేరుగా తన వద్దకు వచ్చి పనులు చేయించుకోవచ్చునని ఆమె సూచించారు .
అయితే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాదని రోజా , టీడీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తూ , వారికి పనులు చేసి పెడుతోందని అమ్ములు వర్గం ఆరోపిస్తోంది .