తెలంగాణాలోని అతికొద్ది మంది సీనియర్ నేతల్లో ఈయన కూడా ఒకడు. చాలామందికి ఉన్న సమస్యే ఈయనకు కూడా ఉంది. అదేమిటంటే తాను చాలా గొప్పోణ్ణి అనే భావన. పైగా ఎస్సీ సామాజికవర్గంలో పుట్టి తన సామాజికవర్గంలోని వాళ్ళతోనే కాదు మిగిలిన సామాజికవర్గం నేతలతో కూడా గొడవలు పడటంతోనే చివరకు ఎటూ కాకుండా పోయాడు. ఇంత కాలానికి వేరే దారిలేక బిజెపిలో చేరబోతున్నారు.
ఇక్కడ సమస్య ఏమిటంటే చిన్న వయసులోనే ఎన్టీయార్ పుణ్యమా అని విద్యార్ధినేతగా ఉన్న మోత్కుపల్లి ఒకేసారి ఎంఎల్ఏ అయిపోయారు. 1985లో రెండోసారి ఎంఎల్ఏ అయిన తర్వాత నేరుగా ఎన్టీయార్ తోన జరిగిన గొడవతో పార్టీ నుండి బయటకు వచ్చేశారు. 1989లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా గెలిచారు. తర్వాత 1994లో మళ్ళీ టిడిపిలో చేరి ఎంఎల్ఏ అయ్యారు.
తర్వాత అనేక మలుపులు తిరిగింది. మొత్తం రాజకీయ జీవితంలో కొన్నిసార్లు గెలిచి మరికొన్ని సార్లు ఓడిపోయారు లేండి. సరే ఇక్కడ గెలుపు, ఓటమితో పాటు పార్టీల కన్నా మోత్కుపల్లి వ్యవహార శైలే ప్రధానంగా మారింది. ఆయన వ్యవహార శైలి వల్లే చాలా మంది నేతలతో గొడవలయ్యాయి. ఫలితంగా టిడిపికి తర్వాత కాంగ్రెస్ కు మళ్ళీ టిడిపి అధినేతతో గొడవలయ్యాయి. చివరకు పార్టీలో చేరకపోయినా ఇటు కాంగ్రెస్ అటు టిఆర్ఎస్ అధినేతలతో కూడా వివాదాల కారణంగా ఆయన రాజకీయ జీవితం ముగింపుకొచ్చేసింది.
తాను అనుకున్నది గనుక అధినేతలు ఇవ్వకపోతే వెంటనే అసమ్మతి నేతగా మారిపోతారనే ఆరోపణలు మొత్కుపల్లిపై ఎక్కువగా వినబడుతుంటాయి. చివరకు టిడిపిలో ఉంటూ టిఆర్ఎస్ కు బలంగా మద్దతు పలికారు. గులాబి పార్టీలో తెలంగాణా టిడిపిని విలీనం చేయాలనే సంచలన ప్రతిపాదన పెట్టి బహిష్కరణకు గురయ్యారు. చివరకు ఏదో అవస్తలు పడి మొత్తానికి బిజెపిలో చేరటానికి రెడీ అవుతున్నారట. మరి ఇక్కడన్నా పార్టీ అధిష్టానం చెప్పిన మాట వింటారో లేదో చూడాలి.