ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. దమ్ముంటే ముసుగు తీసి బయటకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఎక్కడికి రమ్మంటే అక్కడి వచ్చేందుకు మేము సిద్ధమని తెలిపారు.
మీడియాతో మంగళవారం రాత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు పక్కాప్లాన్ ప్రకారమే ఈ విధంగా తనపై హత్యాయత్నం చేయించారని నిప్పులు చెరిగారు. ఆయన ఆస్తులను కాపాడుకునేందుకే ఇలాంటి అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తనపై హత్యాయత్నం చేసింది.. రైతులు మాత్రం కాదని.. టీడీపీ గూండాలేనని ఆయన పేర్కొన్నారు.
తనపై దాడి చేసినవారి విజువల్స్ అన్ని ఉన్నాయని.. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. గతంలో కూడా ఇదే విధంగా తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేశారని వివరించారు. మాపై దాడులు చేయడానికి మేం ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చామా అని కూడా ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు అధికారం నుంచి నిజాయితీగా రాజకీయం చేయాలన్నారు. ‘నాయకులపై దాడులు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా.. నిరసనలు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని’ ఆయన తెలిపారు. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వ లేకపోతున్నారన్నారు .
అన్నివర్గాలకు న్యాయం చేయాలనే సీఎం జగన్ ఈ విధంగా ఆలోచన చేస్తున్నారన్నారు. చంద్రబాబు ట్రాప్లో రైతులు పడొద్దని.. రైతు సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సూచించారు. రైతులపై సీఎం జగన్కు సానుభూతి ఉందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ విధంగా మాట్లాడారు ... హత్యాయత్నం ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలిశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటన గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, విడదల రజని తదితరులు ఉన్నారు.