మంత్రులకు శాఖల కేటాయింపుతో మహారాష్ట్ర అగాడీ వికాస్‌లో కొత్త చిచ్చురగిలింది.  ఓ వైపు పదవులు రానివారిని బుజ్జగించే పనిలో సీఎం ఉద్దవ్ ఠాక్రే బిజీగా ఉంటే.. మరోవైపు.. తమకు ప్రాధాన్యమున్న శాఖలు కేటాయించలేదని కాంగ్రెస్ నేతలు కస్సుబుస్సు లాడుతున్నారు. కొందరు అధిష్టానంతో మాట్లాడేందుకు ఢిల్లీలో చక్కర్లు కొడుతుంటే... మరికొందరు పదవులు స్వీకరించేందుకు ఇష్టపడడం లేదు. 

 

మహా అగాడీ వికాస్ సర్కార్ కు శాఖల కేటాయింపు తలనొప్పులు తెచ్చిపెట్టింది. 36 మంది మంత్రులకు పదవులు కేటాయించగా.... తమకు అప్రాధాన్యమైన పదవులు కేటాయించారని.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.  ఎన్సీపీ, శివసేనలు కీలక పదవులు తీసుకొని.. తమకు పెద్దగా ప్రాధాన్యం లేని పదవులు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు అధిష్టానంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు ఆందోళనలకు దిగుతున్నారు.

 

కాంగ్రెస్ అసంతృప్త నేతల్లో ప్రముఖంగా విజయ్ వడెట్టివర్ కనిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు గట్టిగా మద్దతిచ్చిన ఆయన.. విస్తరణ తర్వాత జాడ లేకుండా పోయారు.  వడెట్టివర్‌కు ఓబీసీ మంత్రిత్వ శాఖ, ఉప్పు కయ్యల అభివృద్ధి, భూకంప బాధితుల పునవాస శాఖలను కేటాయించారు. అయితే ఆ శాఖలతో ఏం చేయగలమని విజయ్ సన్నిహితులు  ప్రశ్నిస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ మంత్రుల్లో మరొకరు అమిత్ దేశ్‌ముఖ్. ఆయనకు మెడకల్ విద్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖను కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన అమిత్.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.


 
కాగా మరో మిత్రపక్షం ఎన్సీపీలో కూడా శాఖల కేటాయింపుపై అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. తనకు ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల భద్రత శాఖను ఇచ్చి, పార్టీలో జూనియర్ అయిన జితేంద్ర అవద్ లాంటి వాళ్లకు హౌసింగ్ శాఖ ఇవ్వడమేంటూ చగన్ భుజ్‌బల్ పార్టీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. అయితే ఎన్సీపీలో వివాదం ఇట్టే ముగిసిపోయేట్టు కనిపిస్తున్నా.. కాంగ్రెస్‌లో మాత్రం అంత తేలిగ్గా తెగేట్టు కనిపిచడం లేదు. రెవెన్యూ శాఖ పొందిన బాలాసాహెబ్ తోరాత్‌ తప్ప మిగతా కాంగ్రెస్ మంత్రులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండడమే దీనికి కారణమని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: