ఇటువంటి ముఖ్యమంత్రిని దేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదని ప్రజలే అంటున్నారని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఏపిలో ముఖ్యమంత్రి, మంత్రులు తమ ఇళ్ల నుంచి బైటకు వచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు.  రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొల్పినట్లుగా ఉందన్నారు. మహిళలు, రైతులు, రైతు కూలీలు, విద్యార్ధులు, ఉద్యోగులు అందరూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారని వాపోయారు. బుధవారం పత్రికా ప్రకటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వాకాలపై  యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాజ్యాంగం కన్నా సీఎం జగన్ కు శారదా పీఠమే మిన్నఅన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. స్వరూపానంద శాసనమే వైసిపికి ఏపి రిఆర్గనైజేషన్ యాక్ట్ కన్నా ఎక్కువ అని విమర్శించారు. స్వామీజితో భేటి, 13న కేసిఆర్ తో భేటిల వెనుక స్కెచ్ ఏమిటి అని నిలదీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముగ్గురూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురి లక్ష్యం ఒక్కటే అని వ్యాఖ్యానించారు. 


తనకేమీ పట్టనట్లుగానే..
రాజధాని తరలింపుపై 5కోట్ల ప్రజల ఆందోళనలు కూడా ముఖ్యమంత్రి జగన్ కు పట్టడం లేదని అని నిలదీశారు. ఏ ప్రాంతం వారికెంత అసౌకర్యం ఉన్నా, ఎవరికెన్ని కష్టాలు ఎదురైనా తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అటు క్రిస్టియానిటి, ఇటు హిందూయిజం మధ్య తన ద్వంద్వ ప్రవృత్తి కప్పెట్టడానికే శారదాపీఠంకు జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యారన్నారు. కాశీ, హరిద్వార్ లకు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి, పరిశుద్ద పరిచి, హిందూ ఓట్లకు చేరువ చేసి, సీఎం అయ్యేందుకు దోహదపడింది ఈ స్వరూపానంద  స్వామీజినే అని వ్యాఖ్యానించారు. వసుధా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అయినప్పటికీ ఆయనతో హిందుత్వ విధానంలో యాగాలు చేయించిందీ ఈయనే అని ఎద్దేవా చేశారు. తనకోసం ఇంతచేసిన స్వామీజి స్వరూపానందకు గురుదక్షిణగానే రాజధాని విశాఖకు జగన్మోహన్ రెడ్డి తరలింపు నిర్ణయం. 

అర్ధరహితమైనవి..
 రాజధానిపై వైసిపి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతికి రాసిన లేఖ, కేంద్రానికి పంపిన వినతి అర్ధరహితమైనవి. రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని భారత పార్లమెంటు ఆమోదించింది. అమరావతిని ఏపి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇటీవల సర్వే డిపార్ట్ మెంట్ మ్యాప్ లో మన రాజధానిగా అమరావతిని చూపకపోతే రాష్ట్ర ఎంపిలే పార్లమెంటులో పట్టుబట్టడంతో, కేంద్రం అమరావతిని రాజధానిగా చూపిస్తూ మరో మ్యాప్ విడుదల చేసింది. ఈ అంశాన్ని లోక్ సభలో  రెయిజ్ చేసింది టిడిపి ఎంపి గల్లా జయదేవ్ అయినా, తమ ఎంపి మిధున్ రెడ్డి ఘనతగా అప్పట్లో వైసిపి చెప్పుకుంది. ఇప్పుడదే వైసిపి ఎంపి రాజధాని తరలింపుపై  ఎందుకని నోరు తెరవడం లేదు.


రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా..
రాక్షస రాజ్యంగా రాష్ట్రాన్ని ఈ 7నెలల్లోనే మార్చారు. 12మంది టిడిపి కార్యకర్తలను హతమార్చారు. ఇసుక కొరత సృష్టించి 60మంది కార్మికులను ఆత్మహత్యలకు పురికొల్పారు. 200 రోజుల్లోనే  285మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు రాజధాని తరలింపుపై ఆందోళనలతో 9మంది మరణించారు. వందలాది చిరుద్యోగుల ఆత్మహత్యా యత్నాలకు అంతే లేదు. ఇటువంటి విధ్వంసకర పాలన మున్నెన్నడూ చూడలేదన్నారు. సీఎం జగన్ ఏ పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కెసిఆర్ ను కలుస్తున్నారో అర్ధం చేసుకోవాలి. ఇది రాష్ట్రానికి మరింత నష్టం చేయడమే అవుతుంది. ఇప్పటికే ఏపిలో పరిస్థితులు పొరుగు రాష్ట్రాల మంత్రుల ముందు నవ్వులపాలైంది. ఆయా రాష్ట్రాలకు ఏపిలో పరిస్థితులు ఏవిధంగా లాభదాయకమో అక్కడి మంత్రులే చెబ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వీలైనంత నష్టం చేయడం, పొరుగు రాష్ట్రాలకు చేతనైనంత మేలు చేయడమే సీఎం జగన్మోహన్ రెడ్డి పాలసీగా పెట్టుకున్నారని యనమల దుయ్యబట్టారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: