సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా, నిరుపేదలకు అండగా దేశంలోనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు జగన్ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6500 కోట్లు కేటాయింపు చేసింది. దీనితో నేరుగా తల్లులకు నగదు బదిలీ కానున్నాయి. తల్లి మరణిస్తే సంరక్షుడికి నగదు ఇవ్వనున్నారు. గురువారం చిత్తూరులో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి. పూర్తి సంతృప్తస్థాయిలో పథకం అమలు కానున్నది. ఫలితంగా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది చేకూరనుంది. హామీ ఇచ్చిన దానికంటే మిన్నగా పథకం అమలవుతున్నట్టే. ఇంటర్మీడియట్ చదవుతున్న విద్యార్థుల తల్లులతో పాటుగా అన్ని ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు కూడా వర్తింపు చేయనున్నారు. అంటే కాకుండా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలకూ అమలు చేయనున్నారు. ఈ క్రమంలో ఘనంగా అమ్మ ఒడి పథకం కార్యక్రమం ప్రారంభానికి ఏర్పాట్లు చేపట్టారు.
ప్రతీ అడుగూ ముందుకే..
సీఎం వైఎస్ జగన్. మాట ఇచ్చారంటే నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతీ అడుగూ ముందుకేస్తున్నారు. అందులో భాగంగానే నవరత్నాల హమీలలో మరో కీలక హమీని నెరవేర్చేందుకు రంగం సిద్దమైంది. చదువుకు పేదరికం ఎప్పుడూ ఆటంకం కాకూడదన్న గొప్ప ఆలోచనతో జగన్ ప్రకటించిన అమ్మఒడి కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ఈ నెల 9న చిత్తూరులో జగన్ ప్రారంభించనున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ‘జగనన్న అమ్మఒడి’ పథకంగా పిలవబడే ఈ స్కీమ్ నవరత్నాల్లో కీలకమైనది. పిల్లలను బడికి పంపే ప్రతి అమ్మ బ్యాంక్ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. ఇంటర్ వరకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుంది.
ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదు..
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదన్న ఆశయంతో వైఎస్ జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం బడ్జెట్లలో ఈ పథకానికి ఏకంగా రూ.6,500 కోట్లు కేటాయించారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రయివేట్ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా జనవరిలో నేరుగా అన్ ఇన్ కంబర్డ్ బ్యాంక్ అకౌంట్లలో జమచేయనున్నారు. ఈ పథకం వల్ల డ్రాపౌట్లు తగ్గుతాయి. పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు వృద్ది చెందుతాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వారోత్సవాలు రేపటితో ముగియనున్నాయి.
వారోత్సవాల చివరి రోజు కార్యక్రమ వివరాలు..
జగనన్న అమ్మ ఒడి పధకం ప్రారంభోత్సవం. అర్హులైన తల్లులు/సంరక్షకులని పాఠశాలలకు ఆహ్వానించాలి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి ప్రజాప్రతినిధులను కూడా ప్రారంభోత్సవ సమావేశానికి ఆహ్వానించాలి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్ధాయిలో సీఎం శ్రీ వైఎస్ జగన్ ప్రారంభిస్తున్నందున కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి పాఠశాలలో పిల్లలు, తల్లిదండ్రులు చూసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలి. ప్రారంభోత్సవాన్ని పండుగను తలపించేలా వేడుకలాగా నిర్వహించాలి.
చిత్తూరులో కార్యక్రమ వివరాలు..
ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం
11.15 - చిత్తూరు పి.వి.కె.ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ సభా ప్రాంగణం వద్దకు చేరుకోనున్న సీఎం
11.15 - 11.35 - పాఠశాల విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్ పరిశీలన
11.35 - 11.40 - స్ధానిక అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు
11.45 - 1.45 - అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభోత్సవం, ప్రజలనుద్దేశించి ప్రసంగం
3.45 - తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం