రాజధాని రైతుల ఉద్యమంపై ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అభ్యంతరం తెలిపారు. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా జరుగుతున్న రైతుల ఉద్యమం నాటకీయంగా కనిపిస్తోందా అని వాసిరెడ్డి పద్మను ప్రశ్నించారు.. రాజధాని కోసం తమకు ప్రాణ సమానమైన భూములను ఇచ్చిన రైతులు నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారి అవివేక నిర్ణయంతో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఆత్మకూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దివ్యవాణి మాట్లాడుతూ.... మహిళలను పావులుగా వాడుకోవడం వైసీపీకి బాగా అలవాటని , అభివృద్ధి చేస్తారని ఓట్లేసి గెలిపించిన ప్రజలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. మీసేవా కేంద్రాలను తొలగించడం ద్వారా 30 వేల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆక్షేపించారు.

 

 ప్రజల నమ్మకాన్ని అధికార పార్టీ రోడ్డు కీడ్చిందని, ఈ పార్టీని ఎందుకు గెలిపించామా అని జనం చెప్పులతో కొట్టుకునే దుస్థితి కల్పించారని దివ్యవాణి మండిపడ్డారు. దిశ చట్టం తెచ్చారే కానీ నేటికీ అమలు చేయలేదు. తన బిడ్డను ఎవరు చంపారో అధికార పార్టీ మంత్రులకు బాగా తెలుసని స్వయంగా ఆయేషా మీరా తల్లి చెప్పారని వ్యాఖ్యానించారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నక్యాంటీన్లను మూసేసి వాటికి రంగులేసి పార్టీ కార్యాలయాలుగా వాడుకోవడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. 

 

జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని ఊరూరా తిరిగిన వైఎస్ విజయలక్ష్మి, భారతి, షర్మిలకు రైతు సమస్యలు కనిపించడం లేదా అని నిలదీశారు. 22 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తుంటే తెలుగు సినీ పరిశ్రమ స్పందించకపోవడం సరికాదని దివ్యవాణి అన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలపై అక్కడి సినీ పరిశ్రమవారు ఒక్క తాటిపైకి వచ్చి పోరాడారని అన్నారు. ఇప్పటికైనా తెలుగుసినీ పరిశ్రమ వారు రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని దివ్యవాణి కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: