భారతీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా సంస్థలను అత్యున్నత స్థానానికి చేర్చిన రతన్ టాటా నుంచి చైర్మన్ స్థానాన్ని 2012, డిసెంబర్లో టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సైరస్ మిస్త్రీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే, పలు కారణాలతో టాటా గ్రూపు నుంచి 2016 అక్టోబర్లో మిస్త్రీని తొలగించారు. మిస్త్రీని తొలగించిన తర్వాత మళ్లీ రతన్ టాటానే తాత్కాలిక చైర్మన్గా కొన్నాళ్లు కొనసాగారు. అయితే, మిస్త్రీ తొలగింపుపై వివాదం చెలరేగింది. ఇది కోర్టు మెట్లు ఎక్కింది. సైరస్ మిస్త్రీని నియమించాలని ఇటీవల ఎన్సీఏల్ఏటీ తీర్పు ఇచ్చింది. అయితే, ఆ తీర్పుపై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది.
టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని కొనసాగించాలని గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. టాటా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ను నియమించడాన్ని ఇటీవల కంపెనీ లా ట్రిబ్యునల్ తన తీర్పులో తప్పుపట్టింది. నటరాజన్ నియామకం అక్రమమైందని ట్రిబ్యునల్ పేర్కొన్నది. దీంతో మిస్త్రీనే మళ్లీ టాటా సంస్థలకు సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఏర్పడ్డాయి. మిస్త్రీని పునర్ నియమించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్ సవాల్ చేస్తూ టాటా సన్స్, రతన్ టాటా, టాటా ట్రస్టీలు సుప్రీంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లుకు ఇవాళ కోర్టు నోటీసులు ఇచ్చింది. అప్పిల్లేట్ ట్రిబ్యునల్ ఈ కేసులో పిటిషన్ల వాదనలు పట్టించుకోలేదని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్ సూర్యకాంత్, బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తాజాగా స్టే విధించింది. కానీ కంపెనీలో మళ్లీ చేరే ఉద్దేశం లేదని ఇటీవల సైరస్ మిస్త్రీ వెల్లడించిన విషయం తెలిసిందే.
కాగా, సైరస్ మిస్త్రీ తొలగింపు టాటా గ్రూప్నకు భారీ నష్టాలే తెచ్చిపెట్టింది. ఆయన తొలగింపు అనంతరం స్టాక్ మార్కెట్ రెండు ట్రేడింగ్ సెషన్లలోనే టాటా గ్రూపులోని కొన్ని కంపెనీలు తమ మార్కెట్ విలువలో సుమారు రూ.17 వేల కోట్లు నష్టపోయాయి. మిస్త్రీ తొలగింపుతో టాటా షేర్లు బాగా క్షీణించాయి. అప్పులు తగ్గించి, తమ వ్యాపారానికి కొత్త రూపు ఇవ్వాలనుకుంటున్న టాటా గ్రూప్నకు మిస్త్రీ తొలగింపు పెద్ద దెబ్బేనని నిపుణులు అంచనాలు వెలువడ్డాయి. మిస్త్రీ నేతృత్వంలో టాటా గ్రూప్ తమ మూలధనాన్ని చక్కగా వినియోగించే దిశగా కీలక అడుగులు వేసిందని, ఆయన లేకపోవడం అంటే గ్రూపు భవిష్యత్తు వ్యూహాలు, అప్పు తగ్గించుకొనే ప్రయత్నాలపై తీవ్ర ప్రభావం పడుతుందని సిటీ గ్రూప్ తెలిపింది.