మహారాష్ట్ర రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో సోహైల్ షేక్ అనే వ్యక్తి కన్నతల్లిని గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత మహిళ శరీరాన్ని ముక్కలుగా కోసి వేరువేరు ప్రదేశాల్లో పడేశాడు. తల్లిని హత్య చేసిన కేసులో 30 సంవత్సరాల వయస్సు గల సోహైల్ షేక్ ను ముంబాయి పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని కుర్లా సబర్బన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే సోహైల్ గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసై ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. సోహైల్ తల్లి ప్రతిరోజు ఏదో ఒక పని చూసుకోమని జులాయిగా తిరగవద్దని కొడుకును హెచ్చరించేది. తరచూ ఈ విషయం మీద సోహైల్ కు, అతని తల్లికి గొడవలు జరిగేవి. కొన్ని రోజుల క్రితం ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న సోహైల్ తన తల్లిని గొంతు నులిమి చంపేశాడు. 
 
మద్యం మత్తు దిగిన తరువాత తన తల్లి విగతజీవిగా పడి ఉండటంతో సోహైల్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తరువాత టీవీలో ప్రసారమయ్యే క్రైం షోను చూసి తన తల్లిని ముక్కలుముక్కలుగా నరికి ఆ ముక్కలను వేరు వేరు ప్రదేశాలలో పడేశాడు. ఆ తరువాత రోజు పోలీసులు విద్యావిహార్ ప్రాంతంలో తల లేని మొండెం లభించటంతో కేసు నమోదు చేశారు. జనవరి 4వ తేదీన శాంతాక్రూజ్ - చెంబూర్ లింక్ రోడ్డులో శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. 
 
పోలీసులు శరీర భాగాలను గుర్తించే సమయానికి శరీరం పూర్తిగా కుళ్లిపోవటంతో పోలీసులకు మహిళ ఎవరో గుర్తించటం కష్టంగా మారింది. పోలీసులు శరీర భాగాలు దొరికిన చోట సీసీ ఫుటేజీలను పరిశీలించగా సోహైల్ బైక్ పై ప్రయాణించినట్లు గుర్తించారు. సోహైల్ ను అదుపులోకి తీసుకొని విచారించగా విచారణలో వాస్తవాలు వెలుగుచూశాయి. సోహైల్ తన తల్లిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు సెక్షన్ 302 కింద సోహైల్ పై కేసు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: