రాయల్ లైఫ్ వద్దని ఎవరూ కోరుకోరు కదా? కానీ కోరుకున్నారు. బ్రిటన్ రాజకుటుంబంలో ఈ కలకలం రేగింది. యువరాజులైన హ్యారీ, విలియమ్స్ మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. తాము రాజకుటుంబం నుంచి వేరుపడుతున్నామని ప్రిన్స్ హ్యారీ-మేఘన్ దంపతులు ప్రకటించారు. ఈ వార్త షాక్ను కలిగించగా...అంతకు మించిన షాక్ ప్రిన్స్ హ్యారీకి కలిగినట్లు సమాచారం.
2018లో బ్రిటన్ ప్రిన్స్ హారీ, ప్రముఖ అమెరికా నటి మెఘన్ మార్కెల్ ఒక్కటయ్యారు. లండన్లోని విండ్సర్ క్యాజిల్లో ఉన్న సెంట్జార్జ్ చర్చి ఈ చారిత్రక ఘట్టానికి వేదికైంది. కోట్లాది మంది టీవీల్లో చూస్తుండగా, ముఖ్యఅతిథుల నడుమ వధూవరులు రింగులు మార్చుకున్నారు. విండ్సర్కు చెందిన డీన్తో కలిసి కాంటెర్బరీ ఆర్చ్బిషప్, ఆంగ్లికన్ చర్చి మతపెద్ద జస్టిన్ వెల్బై ఈ వివాహతంతును నిర్వహించారు. వీరి సమక్షంలో హారీ, మెఘన్ మార్కెల్ పెండ్లి ప్రతిజ్ఞలు చేశారు. వధూవరులను ఉద్దేశించి నల్లజాతీయుడైన అమెరికా మతగురువు మైఖేల్ బ్రూస్ కర్రీ సందేశాన్ని వినిపించారు. వివాహ వేడుకను క్వీన్ ఎలిజెబెత్-2, ప్రిన్స్ ఫిలిప్, ఇతర రాజవంశీయులు ప్రత్యక్షంగా తిలకించగా, బయట పెద్దఎత్తున చేరుకున్న జనం అక్కడ ఏర్పాటుచేసిన స్క్రీన్పై వివాహ వేడుకను చూస్తూ సంబురపడ్డారు.
తాము ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నామని, ఇకపై తాము రాజకుటుంబంలో సీనియర్ సభ్యులుగా ఉండబోమని ప్రిన్స్ హ్యారీ-మేఘన్ దంపతులు ప్రకటించారు. ఇకపై బ్రిటన్తోపాటు అమెరికాలోనూ నివసిస్తామన్నారు. అయితే తమ ఏడాది వయసున్న కుమారుడు ఆర్చీని మాత్రం రాజకుటుంబ సంప్రదాయాల ప్రకారమే పెంచనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రకటనతో రాణి ఎలిజబెత్-2 తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు సమాచారం. ఆమెను సంప్రదించకుండానే ప్రిన్స్ హ్యారీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ఇదిలాఉండగా, ప్రిన్స్ హ్యారీ, మేఘన్లకు ఓ జలక్ తగిలింది. మేడమ్ టుస్సాడ్స్లో ఉన్న ఈ దంపతుల మైనపు విగ్రహాలను తొలగించారు. రాజ కుంటుంబం నుంచి వేరుపడి బ్రతుకుదామనుకుంటున్నట్లు ప్రిన్స్ హ్యారీ దంపతులు ప్రకటించిన మరుసటి రోజే టుస్సాడ్స్ నుంచి వారి మైనపు బొమ్మలను తొలగించేశారు. వాస్తవానికి ఆ బొమ్మలు.. రాయల్ ఫ్యామిలీతో కలిసి ఉండేవి. ఇప్పుడు ఆ మైనపు బొమ్మలను మరో చోటుకు తరలిస్తారు. లండన్లోని టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో సుమారు 250 మంది సెలబ్రిటీల మైనపు బొమ్మలు ఉన్నాయి. అందులో ఈ దంపతుల బొమ్మలు ఒకటి. కాగా, మరోవైపు ప్రిన్స్ హ్యారీ దంపతులతో చర్చలు కొనసాగుతున్నాయని రాజకుటుంబీకుల నివాసమైన బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటించింది.