జియోకు పోటీగా, ఎయిర్టెల్ సైతం ఓ తీపికబురును తన వినియోగదారులకు అందించింది. జియో వైఫై కాలింగ్ సేవలు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రాగా, ఎయిర్టెల్ వైఫై కాలింగ్ కేవలం పలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే లభిస్తున్న నేపథ్యంలో...తాజాగా వాటిని మిగతా ప్రాంతాలకు సైతం విస్తరించింది. తాజాగా, దేశవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు వైఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్టెల్ కస్టమర్లు ఏ వైఫై నెట్వర్క్కు కనెక్ట్ అయి ఉన్నా సరే ఎయిర్ఎల్ వీవోవైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎయిర్టెల్ వెబ్సైట్ను కస్టమర్లు సందర్శించవచ్చు.
ఢిల్లీలో గత నెల ఎయిర్టెల్ వైఫై కాలింగ్ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఈ సేవలు ఇటీవల అందుబాటులోకి రాగా.. ప్రస్తుతం ఎయిర్టెల్ వైఫై కాలింగ్ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ సేవలు 100కు పైగా స్మార్ట్ఫోన్లలో లభిస్తున్నాయి. షియోమీ, శాంసంగ్, వన్ప్లస్, ఆపిల్, వివో, టెక్నో, స్పైస్, ఐటెల్, ఇన్ఫినిక్స్, మొబిస్టార్, కూల్ప్యాడ్, జియోనీ, అసుస్, మైక్రోమ్యాక్స్, జోలో, పానాసోనిక్ కంపెనీలకు చెందిన పలు స్మార్ట్ఫోన్లలో వినియోగదారులు ఎయిర్టెల్ వైఫై కాలింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు.
వీవోవైఫై (VoWiFi) లేదా వాయిస్ ఓవర్ వైఫైనే వైఫై కాలింగ్ అని అంటారు. అయితే అసలు వైఫై కాలింగ్ అంటే ఏమిటి..? దాంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అనే సందేహం సహజంగానే కలుగుతుంది. సాధారణంగా మనం ఫోన్లలో చేసే కాల్స్ మొబైల్ నెట్వర్క్ ద్వారా వెళ్తాయి. అయితే వీవోవైఫైలో మనం చేసే కాల్స్ వైఫై ద్వారా వెళ్తాయి. అందుకనే దాన్ని వైఫై కాలింగ్ అంటారు. ఈ క్రమంలో వినియోగదారులు స్పష్టమైన వాయిస్, వీడియో కాల్స్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ చాలా తక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారు తమ ఫోన్లను వైఫై నెట్వర్క్కి కనెక్ట్ చేయడం ద్వారా స్పష్టమైన క్వాలిటీతో కాల్స్ చేసుకోవచ్చు. దీంతో నెట్వర్క్ కనెక్టివిటీ, కాల్ డ్రాప్, కాల్ డిస్కనెక్ట్ సమస్యలు తప్పుతాయి.