తెలుగు లోగిళ్లలో పండుగ సందడి పెద్ద ఎత్తున ఉండే సంక్రాంతి ఎఫెక్ట్ సహజంగానే హైదరాబాద్ నగరంపై పడుతుంది. ఫెస్టివల్కు ముందు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు కలిసి రావడంతో శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం నుంచే ప్రయాణికులు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో నగరంలోని ప్రయాణ ప్రాంగణాలన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్ ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. టికెట్ కౌంటర్లు, ఫ్లాట్ఫారాలు జనంతో పూర్తిగా నిండిపోయాయి. అలాగే ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా ఉన్నాయి.
దీం తోపాటుగా పండుగ సందర్భంగా నగరవాసులు సొంత వాహనాల్లో ఊళ్లకు బయలుదేరడంతో రహదారులపై రద్దీ కనిపిస్తోంది. టోల్ప్లాజాల వద్ద అక్కడక్కడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొన్ని టోల్ప్లాజాల వద్ద వాహనదారులకు ఇబ్బంది లేకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద టోల్ ఛార్జీలు చెల్లించేందుకు వాహనదారులు గంటల కొద్ది వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో టోల్ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇక నిమిష నిమిషానికి హైవేలపై రద్దీ పెరిగిపోతోంది. టోల్ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. మాడ్గుపల్లి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీగా బాగా ఉంది. పాఠశాలలు, కళాశాలకు సెలవులు రావడంతో స్వగ్రామాల్లో పండుగ జరుపుకునేందుకు తరలివెళ్తుండటంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటికిటలాడుతున్నాయి.కాగా, సంక్రాంతి పండుగ సమయంలో జరిగే దొంగతనాలను అరికట్టడానికి హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుపుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంత గ్రామాలకు వెళ్లాల్సినవారు ముందస్తు సమాచారం ఇస్తే తగిన భద్రతలను ఏర్పాటు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.