శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీరాజ్.. ఓ ఉద్యోగినితో జరిపిన సరస సంభాషణ ఆడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసి అందరిచేత విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన ఇప్పుడు తన స్థాయిని మరిచి చాలా అసహ్యంగా మాట్లాడి.. కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ ఛానెల్లో పనిచేసే పార్ట్ టైమ్ ఉద్యోగినితో ఆయన ఫోన్లో సాగించిన సంభాషణ పృథ్వీ వ్యక్తిత్వాన్ని ఛీ కొట్టేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా పృథ్వీరాజ్ మీద ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పృథ్వీ తిరుమల కొండ మీద ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్లోనే మద్యం తాగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
ఛానెల్ పనిచేసే ఓ యువతితో పృథ్వి రొమాంటిక్గా మాట్లాడిన ఆడియో టేపులను కందారపు మురళి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. `ఓ కామాంధుడు ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ కావడం దారుణం. నటుడు పృథ్వీ ఉద్యోగులను బూతులు తిట్టడం, ఉద్యోగినులను లైంగికంగా వేధిస్తున్నారు. సినిమాల్లో హాస్యం పండించే ఆయన ఇక్కడ శృంగారం ఒలకబోస్తున్నారు. టీటీడీకి చెందిన ఎస్వీబీసీలో ఇక వెంకటేశ్వర స్వామి వైభవం చూపుతారా... లేక పృథ్వీరాజ్ లీలలు చూపుతారో చెప్పాలి. ఉద్యోగుల పరిచయ సమయంలో కులం అడిగిన ఘనుడు పృథ్వీ. ఛానెల్ కార్యాలయంలోనే ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిడానికి పృథ్వీ యత్నిస్తున్నారు.
36 ఉద్యోగాలు ఇప్పించి పృథ్వీ లక్షల రూపాయలు దండుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆయన్ను మందలించారు. చివరకు 30 మందిని తొలగించారు.’ అని కందారపు మురళి ఆరోపించారు. అలాగే తక్షణం పృథ్వీని ఆ పదవి నుంచి తొలగించాలని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఇంకెంతమందిని వేధిస్తున్నాడో.. సినిమా పరిశ్రమలో తప్పులు చేయడం వేరు. ఆధ్యాత్మిక సంస్థలో ఇటువంటి పనులు చేయడం తప్పు. ఆయనపై జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్ వైబీ సుబ్బారెడ్డి స్పందించారు. సాయంత్రం లోగా టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.