ఎస్విబిసి ఛైర్మన్ గా సినీనటుడు పృధ్విరాజ్ రాజీనామా దెబ్బకు వైసిపి నేతల్లో వణకు మొదలైంది. ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదన్న విషయం పృధ్వి రాజీనామాతో అందరికీ అర్ధమైంది. బాధ్యతల ముందు, పరిధి దాటిని వారు ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి వెనకాడరనే మెసేజ్ పార్టీ నేతలందరిలోకి వెళ్ళిపోయింది. దాంతో వివిధ పోస్టుల్లో ఉన్నవారు ఇక పై తమ పరిధులేమిటో తెలుసుకుని వ్యవహరించాల్సుంటుంది.
రాజధాని అమరావతిని తరలించే విషయంలో ఓ ఐదారు గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ఆందోళనల విషయమై పృధ్వి మాట్లాడుతూ జరుగుతున్నదంతా కార్పొరేట్ రైతుల ఆందోళనే అంటూ వ్యాఖ్యానించారు. పైగా రైతులంటే ఎలా గుంటారో ? ఎలా గుండాలో కూడా ఈ సీనియర్ నటుడు తేల్చేశారు. దాంతో పృధ్వి వ్యాఖ్యలపై రెండు రోజుల క్రితమే మరో సినినటుడు పోసారి కృష్ణమురళి విరుచుకుపడ్డారు.
నిజానికి ఎస్వీబిసి ఛైర్మన్ హోదాలో పృధ్వి తిరుమల తిరుపతి దేవస్ధానం కు సంబంధించిన విషయాలపై మాత్రమే దృష్టి పెడితే సరిపోయేది. అలా కాకుండా రైతుల గురించి, ఆందోళనల గురించి నోరు పారేసుకున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు ఆందోళనల గురించి మాట్లాడుతున్న స్టైల్లో పృధ్వి కూడా మాట్లాడటం చాలామందిని ఆశ్చర్య పరిచింది.
పోసాని తనను తప్పు పట్టిన తర్వాతైనా ఏదో సర్దుబాటు చేసుకునుంటే సరిపోయేది. అలా కాకుండా తాను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని పైగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడాల్సిన బాధ్యతతో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా చెప్పారు. తాను మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదంటూ మళ్ళీ సమర్ధించుకున్నారు. దాంతో విషయం పెద్దదైపోయి చివరకు వివాదం జగన్ దాకా వెళ్ళింది.
ఇదే సమయంలో ఎస్వీబిసి లో ఓ మహిళా ఉద్యోగితో లైంగికంగా మాట్లాడిన ఆడియో టేపు ఒకటి బయటపడింది. దాంతో వివాదం మరింతగా పెరిగిపోయింది. సరే ఆడియో టేపుల మీద విచారణ జరుగుతుండగానే పృధ్వి రాజీనామాకు జగన్ ఆదేశించటంతో చివరకు రాజీనామా చేయక తప్పలేదు. పరిధి దాటి మాట్లాడితే ఎటువంటి వారైనా, ఎంత సన్నిహితులైనా జగన్ సహించడనే మెసేజ పృధ్వి రాజీనామాతో నేతలందరికీ వెళ్ళిపోయింది.