ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావులు ఇద్దరూ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కానున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమం లోనే హైదరాబాద్ లోని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కేసీఆర్, కేటీఆర్ ఘన స్వాగతం పలికారు.
ఇక ఇరువురు నేతలు కలిసి కాసేపట్లో భోజనం కలిసి చేస్తారు. అనంతరం వారిరువురూ సమావేశమై తాజా రాజకీయ పరిణామాలతో పాటు నదుల అను సంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల పై చర్చించనున్నట్లు సమాచారం.. వీటితో పాటు విభజన సమస్యలు, పెండింగ్ లో ఉన్న పలు విషయాలపై వారు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూల్లోని సంస్థల విభజన, ఇతర పెండింగు అంశాలపైనా ఇరువురు సీఎంలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ ఉద్యోగులు, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు తదితర అంశాలపై చర్చిస్తారని సమాచారం.
ఏపీలో మూడు రాజధానుల అంశం వారిద్దరి మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. 9,10 షెడ్యూల్ సంస్థల విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు తదితర వాటిపై చర్చించనున్నట్టు సమాచారం.
ఇద్దరు సీఎంలు గతంలో మూడు సార్లు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్లో లంచ్ తర్వాత భేటీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.ప్రగతి భవన్ చేరుకున్న వైఎస్ జగన్కు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు.