కశ్మీర్ పోలీస్ అధికారి దేవేందర్ సింగ్ ఇద్దరు ఉగ్రవాదులతో పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అతడిని కూడా ఉగ్రవాదిగానే ట్రీట్ చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే దేవేందర్  పేరు గతంలో పార్లమెంట్ పై దాడి చేసిన అఫ్జల్ గురు విచారణలో కూడా వినిపించిందన్న నిజం ఆలస్యంగా వెలుగుచూసింది. 

 

శ్రీనగర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద డిప్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేస్తున్న దేవేందర్  సింగ్‌.. గతేడాది ఇండిపెండెన్స్ డే
 సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం కూడా అందుకున్నారు. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే దేవేందర్  స్వచ్ఛంధంగా జమ్ముకశ్మీర్‌లోని స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన ఈ విభాగాన్ని ప్రస్తుతం స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌గా పిలుస్తున్నారు. కేవలం ఆరేళ్ల కాలంలో దేవేందర్ .. బద్గామ్‌ ఎస్‌ఓజీకి హెడ్‌గా ఎదిగారు. 

 

చాలా కాలం క్రితమే దేవేందర్ పై అరోపణలు వచ్చాయి. ఉగ్రవాదులకు సాయం చేస్తూ కశ్మీర్‌లో పౌరులను హింసిస్తున్నారని 2001లో విమర్శలు వచ్చాయి. అప్పుడే అతడిని అరెస్టు చేయాల్సి ఉండగా.. బదిలీతో సరిపెట్టారు. ఎస్‌ఓజీ డీఎస్పీ స్థాయి నుంచి సెంట్రల్‌ కశ్మీర్‌లో ఇన్‌స్పెక్టర్‌గా మార్చారు. అయితే ఆ తర్వాత దేవేందర్  ఆధ్వర్యంలో అనేక కస్టోడియల్‌ మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. దేవేందర్  విచారణ పద్ధతి చాలా కఠినంగా ఉండేదని గతంలో అరుంధతీ రాయ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. పార్లమెంట్‌ దాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఓ కేసులో దేవేందర్  అఫ్జల్‌ గురును అరెస్టు చేశారు. ఆ సమయంలో నిర్బంధ గృహానికి తీసుకొచ్చిన అఫ్జల్‌ను తీవ్రంగా హింసించినట్లు దేవేందర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం.

 

పార్లమెంట్‌ దాడి ఘటనలోనే దేవేందర్  సింగ్‌ పేరు చెప్పాడు అఫ్జల్ గురు. అయితే దానికి సరైన ఆధారాలు లేకపోవడంతో.. పోలీసులు దేవేందర్  పై చర్యలు తీసుకోలేకపోయారు. ఇవే కాకుండా స్థానికుల పట్ల కూడా దేవేందర్  చాలా దురుసుగా ఉండేవారని తెలుస్తోంది. ఉగ్రవాదులని తప్పుడు కేసులు పెడతానని బెదిరించి స్థానిక వ్యాపారులు, ట్రక్‌ డ్రైవర్ల నుంచి డబ్బులు దోచుకునేవారని 2015లో ఆరోపణలు వచ్చాయి. అంతేగాక గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు పోలీసులకు చిక్కకుండా వారికి సాయం చేస్తాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా జమ్ముకశ్మీర్‌ పోలీసులు దేవేందర్ పై ప్రత్యేక నిఘా పెట్టారు. శుక్రవారం హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది నవీద్‌ ముస్తాక్‌ ఫోన్ సంభాషణ నిఘా సంస్థల దృష్టికొచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు చెక్‌ పోస్ట్‌ వద్ద పహారా కాసి దేవేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

 

డబ్బు మీద అత్యాశతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీస్ చెక్ పోస్టుల నుంచి సేఫ్ గా తీసుకెళ్లడానికి 12 లక్షల డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: