ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందించారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది . ఇప్పటికే మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తోన్న నేపధ్యం లో జరిగిన ముఖ్యమంత్రుల భేటీ లో ఈ అంశం పై కొద్దిసేపు చర్చ జరిగినట్లు తెలుస్తోంది . ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకు , కేసీఆర్ కూడా మద్దతునిస్తూనే పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం .
రాజధానుల ఏర్పాటుపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ సందర్బంగా ఆయన జగన్మోహన్ రెడ్డి కి పలు సలహాలు, సూచనలు చేయగా , జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది .మూడు రాజధానుల ఏర్పాటు వల్ల సామాజిక, రాజకీయ పరిస్థితులు ప్రభావం ఎలా ఉందనునుందనే విషయమై జగన్మోహన్ రెడ్డి , కేసీఆర్ కు వివరించినట్లు తెలుస్తోంది. అయితే అమరావతి ప్రాంత రైతుల నిరసన, ఉద్యమాలపై కేసీఆర్ ఒకింత ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం . మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ , అమరావతి ప్రాంత రైతులు గత కొన్నిరోజులుగా ఆందోళనలు , నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెల్సిందే .
రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు , ప్రధానంగా రైతులు రోజుకింత ఉద్యమాన్ని ఉదృతం చేస్తూ , అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు . రైతుల ఉద్యమానికి విపక్షాలు కూడా మద్దతునిస్తున్న నేపధ్యం లో , అమరావతి రైతు ఉద్యమం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ సూచించగా , అదేమీ పెద్ద విషయం కాదని జగన్మోహన్ రెడ్డి కొట్టి పారేసినట్లు తెలుస్తోంది . అయితే మూడు రాజధానుల ప్రతిపాదనకు కేసీఆర్ మద్దతునివ్వడం పట్ల జగన్మోహన్ రెడ్డి ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది .