ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులను ప్రతిపాదించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అనుకున్నది సాధించారా ? అంటే పొలిటికల్ సర్కిల్స్ లో అవుననే సమాధానం విన్పిస్తోంది . మూడు రాజధానులపై అన్ని పార్టీల్లో భిన్నాభిప్రాయాలు విన్పిస్తున్నాయి . ఇప్పటికే టీడీపీ నేతలు ప్రాంతాలవారీగా విడిపోయినట్లు కన్పిస్తున్నారు . కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటును టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కేఈ కృష్ణమూర్తి స్వాగతించగా , విశాఖలో రాజధాని ఏర్పాటుకు గంటా శ్రీనివాసరావు జై కొట్టారు .
బీజేపీ నేతలు కూడా మూడు రాజధానుల అంశం పై ఎవరికీ వారు ... తమకు తోచినట్లుగా మాట్లాడుతూ , పార్టీ క్యాడర్ ను గందరగోళ పరుస్తున్నారు . కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటును రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ , బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి లు స్వాగతించడమే కాకుండా , కర్నూల్ లో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు . రాజధానిగా అమరావతిని యధావిధిగా కొనసాగించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి లు డిమాండ్ చేస్తున్నారు . ఇక మరొక రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్సింహారావు , అసలు రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోదని , దానితో అసలు కేంద్రానికి సంబంధమే లేదని తేల్చి చెబుతున్నారు . ఇక తాజాగా కమ్యూనిస్టు పార్టీ లో సైతం చీలిక వచ్చినట్లు స్పష్టమవుతోంది .
అధికార వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమన్న అభిప్రాయాన్ని కర్నూల్ జిల్లా సిపిఐ కమిటీ వ్యక్తం చేస్తోంది . ఈ మేరకు తీర్మానం కూడా చేసినట్లు సమాచారం . జగన్ సర్కార్ వ్యూహం తో ఒకేఒక దెబ్బకు విపక్షాలన్నీ ప్రాంతాలవారీగా చీలిపోయే పరిస్థితి నెలకొంది . మూడు రాజధానుల ఫార్ములా సక్సెస్ అవుతుందో లేదో కానీ విపక్షాలను తన నిర్ణయంతో జగన్ కోలుకోలేని దెబ్బ కొట్టారని అంటున్నారు .