రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేవి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు. గోదావరి జిల్లాల్లో జరిగే పందేలను చూడటానికి ఇతర జిల్లాల ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు వస్తూ ఉంటారు. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే రాజకీయ నాయకులు, మంత్రి హోదాలో ఉన్నవాళ్లు కూడా ప్రతి సంవత్సరం గోదావరి జిల్లాలో జరిగే పందేలను వీక్షించటానికి వస్తారు.
 
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భీమవరం వెళ్లి అక్కడ జరిగే సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు. తలసాని సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం తలసాని శ్రీనివాస్ యాదవ్ భీమవరంలో జరిగే కోళ్ల పందేలను కూడా వీక్షిస్తారని తెలుస్తోంది. భీమవరం ప్రాంతంలోని పోలీసులు తలసాని రాకతో ఇప్పటికే అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. ప్రతి సంవత్సరం తలసాని శ్రీనివాస్ యాదవ్ భీమవరంకు వచ్చి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారని కోడి పందేలను వీక్షిస్తారని సమాచారం. 
 
రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ సంబరాలకు ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారు. నూతన వస్త్రాలు ధరించి ఇంటిల్లిపాది సంబరాలు జరుపుకుంటున్నారు. సరుకులను వారం రోజుల ముందుగానే కొనుగోలు చేసి నోరూరించే వంటలను తయారు చేసుకుంటున్నారు. వంటకాలకు సంక్రాంతి పండగ పెట్టింది పేరు. భోగి రోజున గారెలు, దోసెలు, ఇతర వంటకాలు చేస్తారు. 
 
సంక్రాంతి పండుగ రోజున పెద్దలకు పూజించి ప్రసాదాలను, వంటకాలను చేసుకుంటారు. కనుమ పండుగ రోజున రైతులకు చేదోడు వాదోడుగా నిలిచే బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. ఈ పండుగకు ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఏడాది పొడవునా కష్టపడిన రైతులు అరిగిపోయిన పరికరాలను భోగి మంటలలో వేసి చలి కాల్చుకుంటూ ఉంటారు. ఈరోజు భోగి పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా భోగి మంటలే కనిపిస్తున్నాయి. మగవాళ్లు పెంచెకట్టుల్లో, ఆడవాళ్లు తెలుగుదనం ఉట్టిపడే చీరల్లో దర్శనమిస్తున్నారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: