మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ చేసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు మున్సిపాలిటీల్లో మెజార్టీ వార్డుల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఇప్పటికే ఏడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. చెన్నూరు ఎమ్మెల్యేగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల ఈ ఏకగ్రీవం సాధ్యమైందని అంటున్నారు.
కాగా, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సుమన్ టీఆర్ఎస్ నేత, ఎంపీ బోడకుంటి వెంకటేశ్ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకుడే. స్థానిక ఎమ్మెల్సీ పురాణం సతీష్ సైతం గులాబీ నేతే కావడంతో చైర్పర్సన్ ఎన్నికకు కావాల్సిన ఓట్లను టీఆర్ఎస్ పొందనుంది. ఇదే సమయంలో కో ఆప్షన్ సభ్యులుగా కూడా గులాబీ పార్టీ నేతలకు అవకాశం దక్కనుంది. ఎన్నికల్లో గెలిచింది మొదలు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న నేతల వల్లే ఈ విజయం సాధ్యమైందని టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వారు అక్కడికి వెళ్లి దాని గురించి ఆరా తీసి ప్రజల సమస్యలు దూరం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు దగ్గర చేస్తున్నారు. అవి అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గతంలో ఉన్న అవినీతి స్థానంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు సరైన న్యాయం జరుగుతోంది. దీంతో ప్రజలు గతంలో ఎప్పుడూ లేని విధంగా సంతోషంగా ఉన్నారు. అదే అన్ని ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని అందుకే ఏకగ్రీవమైందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
ఇదిలాఉండగా పురపాలక ఎన్నికల్లో జనవరి 8నుంచి 10వరకు వార్డుల వారీగా నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 12న అభ్యంతరాల స్వీకరణ, 13న అభ్యంతరాల డిస్పోజ్, 14న ఉపసంహరణ ఉండనుంది. 14న మధ్యాహ్నం 3గంటల తర్వాత వార్డులవారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. అప్పటి నుంచే అభ్యర్థులు అధికారికంగా ప్రచారం మొదలుపెడతారు. 22న పోలింగ్ ఉండగా 36 గంటల ముందు అంటే 20 న సాయంత్రమే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. ఈ మేరకు అభ్యర్థులు అధికారికంగా నిర్వహించే ప్రచారం ఆరు రోజులకే పరిమితమవుతుంది.